
జగదేవపూర్, వెలుగు: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ నర్సాపూర్ సమీపంలో జరిగే శ్రీ కొండపోచమ్మ జాతర రెండో రోజు భక్తులు పోటెత్తారు. కొమురవెల్లి మల్లన్నను దర్శించుకొని కొండపోచమ్మ సన్నిధికి వేలాది భక్తులు తరలివచ్చారు. మంగళవారం ఉదయం నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలో నిల్చున్నారు.
మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుళ్ల మధ్య నాట్యం చేస్తూ అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ చంద్రమోహన్ బందోబస్తు చర్యలు చేపట్టారు. కాగా మొబైల్ టాయిలెట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలయం వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు.