
వరుసగా సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతోన్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అదివారం, సోమవారం స్కూళ్లకు, ఆఫీసులకు వరుసగా సెలవు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో స్వామివారి దర్శనానికి వచ్చారు.
31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కాగా 2023 సెప్టెంబర్ 30న 88,623 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు .. 43,934 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు .నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.67 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఇక మరోవైపు శ్రీశైల మల్లన్న ఆలయానికి సైతం భక్తులు పోటెత్తారు. 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి అమ్మవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక తెలంగాణలోని యాదాద్రిలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.