
- 6 లక్షల ఎకరాల అటవీ భూములు ఎటుపోయినయ్?
- ధరణి పోర్టల్లో లెక్కా పత్రం లేదు.. గుర్తించిన ధరణి కమిటీ
- అటవీ శాఖ లెక్కల ప్రకారం ఫారెస్ట్ ల్యాండ్ 53 లక్షల ఎకరాలు.. ధరణిలో ఉన్నది 47 లక్షల ఎకరాలే
- ఆ 6 లక్షల ఎకరాల భూముల సంగతి తేల్చాల్సిందే
- కమిటీ సమావేశంలో నిర్ణయం
- సాగుకు యోగ్యంకాని 20 లక్షల ఎకరాలకూ రైతుబంధు వెళ్తున్నట్లు గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దాదాపు 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ధరణి పోర్టల్లో కనిపించడం లేదని ధరణి కమిటీ గుర్తించింది. ఈ భూములన్నీ ఎటు మారాయో.. ఎవరి పేర్ల మీద ఉన్నాయో తేల్చేందుకు సిద్ధమైంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలోనే సిఫారసులు చేయనుంది. ధరణి పోర్టల్లోని సమస్యలు, పోర్టల్ రీకన్స్ట్రక్షన్పై సీసీఏల్ఏ కన్వీనర్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ధరణి కమిటీ శనివారం సెక్రటేరియెట్లో ఫారెస్ట్, అగ్రికల్చర్ అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఫారెస్ట్ ల్యాండ్స్పై విస్తృతంగా చర్చించింది. ఫారెస్ట్ యాక్ట్లో సెక్షన్ 15 ప్రకారం రాష్ట్రంలో అటవీ భూములు 53 లక్షల ఎకరాలుగా ఉన్నది.
అయితే ధరణి పోర్టల్లో అటవీ భూముల లెక్క 47 లక్షల ఎకరాలు మాత్రమే చూపిస్తున్నది. ఇంకో 6 లక్షల ఎకరాల లెక్క తేలడం లేదు. ఇందులో కొన్ని భూములు అన్సైన్డ్ లిస్ట్లో చూపిస్తున్నాయి. మరికొన్ని ఏ రకంగా నమోదయ్యాయో లెక్కా పత్రం లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న భూముల లెక్కలతో.. ధరణి పోర్టల్లో ఉన్న అటవీ భూముల లెక్కతో వివరాలు సరిచేసేందుకు వెంటనే యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిన వాటికి సంబంధించి చాలా చోట్ల సక్సెషన్ సమస్యలు వస్తున్నట్లు కమిటీ దృష్టికి వచ్చింది.
ఆ భూములకూ రైతుబంధు?
రాష్ట్రంలో ప్రస్తుతం 72 లక్షల మంది రైతులకు 1.59 కోట్ల ఎకరాలకు రైతు బంధు తీసుకుంటున్నారని ధరణి కమిటీ భేటీలో వ్యవసాయ శాఖ వెల్లడించింది. వ్యవసాయ శాఖ తరఫున 2018 నుంచి ఆన్లైన్లో క్రాప్ బుకింగ్ చేస్తున్నామని, అయితే దాదాపు 20 లక్షల ఎకరాల్లో అన్ కల్టివేటెడ్ ఉంటుందని పేర్కొంది. దీనికి కూడా రైతుబంధు అందుతున్నది. బిల్డింగ్స్కు, హైవేల్లో పోయిన ల్యాండ్స్, ప్రాజెక్టుల్లో, రోడ్లకు, ఇతరత్రా ప్రభుత్వ అవసరాలకు మళ్లిన భూములు ఇందులో ఉన్నట్లు చర్చకు వచ్చింది. తమకు కేవలం బ్యాంకు లింకేజీ సౌకర్యం కల్పించారని, నాన్ అగ్రికల్చర్కు రైతుబంధు వెళ్లకుండా వెరిఫై చేసే అవకాశం లేదని ధరణి కమిటీకి వ్యవసాయ శాఖ వివరించింది.
అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల(ఏఈవో)తో ఫీల్డ్ వెరిఫై చేసి ఏ ల్యాండ్స్ సాగుకు యోగ్యం కావో ధరణి పోర్టల్లో ఎంట్రీ చేసే అవకాశం ఇస్తే బాగుంటుందని ధరణి కమిటీ అభిప్రాయపడింది. సమావేశంలో ధరణి కమిటీ సభ్యులు రేమండ్ పీటర్, లచ్చిరెడ్డి, కోదండరెడ్డి, భూమి సునీల్, మధుసూదన్తో పాటు వ్యవసాయ, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే వచ్చే నెల 3న మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియెట్లో ధరణి కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఎండోమెంట్, వక్ఫ్, సర్వే అండ్ సెటిల్మెంట్ అధికారులతో భేటీ కానుంది.