
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్న ప్రతిసారి భారత్, దాని ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి ద్వేషపూరిత ఆలోచనలను పంచుకోవడం అస్సలు మిస్ చేయరని విమర్శించారు. మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు ప్రపంచ స్థాయిలో వస్తున్న గుర్తింపును చూసి రాహుల్ తట్టుకోలేకపోతున్నారని, అందుకే నిరంతరం ద్వేషిస్తున్నారని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటములతో రాహుల్ గాంధీ ముఖంలో ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపిస్తుందని, దేశాన్ని, దేశ పౌరులను అవమానించే ఏ అవకాశాన్ని ఆయన వదులుకోలేకపోవడానికి ఇదే కారణమని ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు.