
యాదాద్రి, వెలుగు : భువనగిరి ఎస్సీ హాస్టల్లో ఇద్దరు టెన్త్ స్టూడెంట్ల మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి బాడీలపై గాయాలున్నాయని కుటుంబసభ్యులు, స్టూడెంట్స్ ఆరోపిస్తుండగా పోలీసులు మాత్రం ఆ వాదనను కొట్టిపారేస్తున్నారు. ఈ నెల 3న రాత్రి పదో తరగతి చదువుతున్న కోడి భవ్వ, గాదె వైష్ణవి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించారు. మూడు రోజులైనా ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి స్పష్టత రాకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి.
హాస్టల్ వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులు, మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం జరగగా.. పోలీసులు తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెబుతున్నారు. బాడీల మీద గాయాలు ఏమీ లేవని అంటున్నారు. స్టూడెంట్స్ రాసినట్టు చెప్తున్న సూసైడ్లెటర్నిజమైనదేనా అన్న అనుమానాలు తలెత్తున్నాయి. లెటర్లో ఉన్నది వారి చేతిరాత కాదని, పదో తరగతి చదువుతున్న వాళ్లు రాసినట్టు లేదని స్టూడెంట్స్, పేరెంట్స్ అభిప్రాయపడుతున్నారు. హాస్టల్ వార్డెన్ శైలజను ఏమనవద్దని రాయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెటర్, స్టూడెంట్స్ నోట్బుక్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తామని పోలీసులు చెప్పారు. స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారా ? వారిని ఎవరైన వేలాడదీశారా..? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు. పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. సాక్ష్యాల సేకరణ, పరిశీలన తర్వాత అనుమానితులను విచారిస్తామన్నారు.
హాస్టల్ ఖాళీ..
స్టూడెంట్స్ మృతి చెందడంతో భయాందోళనకు గురైన స్టూడెంట్స్హాస్టల్ ఖాళీ చేశారు. హాస్టల్ సిబ్బంది పేరెంట్స్కు సమాచారం అందించి వారిని ఇండ్లకు పంపించేశారు. ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్స్ రూమ్ సీజ్ చేశారు. జిల్లాలో 21 ఎస్సీ హాస్టల్స్ఉండగా .. సగం హాస్టల్స్లోనే రెగ్యులర్ వార్డెన్లున్నారు. మిగతా చోట్ల ఇన్చార్జిలతో నడిపిస్తున్నారు. భువనగిరి హాస్టల్ వార్డెన్ శైలజ కూడా బీబీనగర్, పోచంపల్లిలోని హాస్టల్స్కు ఇన్చార్జీగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగా పిల్లలపై వార్డెన్స్ పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదని తెలుస్తోంది.