
ముంబై: ఈసారి ఐపీఎల్లో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించకపోయినా.. వచ్చే ఏడాది కోసం ఇప్పటి నుంచే రెడీ అవుతామని చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ అన్నాడు. వచ్చే సీజన్లో ఆడే తుది 11 మందిలో ఉండేలా తోటి ఆటగాళ్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించాడు. ప్లేయర్లు ఆటను సరిగ్గా స్వీకరించలేకపోతున్నారన్న మహీ వచ్చే ఏడాదిలో ఆడే కోర్ టీమ్ను గుర్తించేందుకు తాను చాలా దగ్గరగా ఉన్నానని హెచ్చరించాడు.
‘మన ముందున్న ప్రతి మ్యాచ్లో గెలవాలని కోరుకోవాలి. ఒకసారి ఒక మ్యాచ్ గురించే ఆలోచించాలి. కొన్నింటిలో ఓడినా సరైన కాంబినేషన్ను గుర్తించడం చాలా ముఖ్యం. చాలా మంది ప్లేయర్లను మార్చాలని కోరుకోరు. కాకపోతే క్వాలిఫై అయ్యేందుకు ప్రయత్నించడం చాలా ముఖ్యం. సరైన 11 మంది లభించకపోయినా బలంగా తిరిగి రావడమైతే చాలా ప్రధానం’ అని ధోనీ పేర్కొన్నాడు. గతంలో డాడ్స్ ఆర్మీగా ముద్రపడిన సీఎస్కేను 2026లో మాత్రం కొత్తగా చూసే చాన్స్ ఉంది.
ఎందుకంటే 17 ఏండ్ల ఆయుష్ మాత్రే, 20 ఏండ్లషేక్ రషీద్, 21 ఏండ్ల బ్రేవిస్, 22 ఏండ్లవంశ్ భేడీ, 25 ఏండ్ల రచిన్ రవీంద్రతో పాటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివం దూబేలతో కలిసి బ్యాటింగ్ కోర్గా ఉండే అవకాశం ఉంది. ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఆరింటిలో ఓడిన చెన్నై రాబోయే ఆరు మ్యాచ్ల్లోనూ గెలిస్తే ప్లే ఆఫ్స్ ఆశలు ఉంటాయి. అయితే ప్రస్తుతానికి ఇది చాలా కష్టంగా కనిపిస్తోంది. ‘మేం మంచి క్రికెట్ ఆడటం వల్లే విజయాలు సాధించాం.
అదే సమయంలో మంచి క్రికెట్ ఆడనప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించి భావోద్వేగానికి గురి కావొద్దు. కానీ ఆచరణాత్మకంగా ఉండాలనుకోవడం ముఖ్యం’ అని ఎంఎస్ వెల్లడించాడు. ఈ సీజన్లో భారీ స్కోర్లు చేయడం లేదా ఛేదించడంలో తాము విఫలమయ్యామని చెప్పాడు. తమ బ్యాటర్లు కొంచెం ముందుగా దూకుడును మొదలుపెట్టాలని సూచించాడు. డెత్ ఓవర్లలో అత్యుత్తమ బౌలర్ అయిన బుమ్రాను మరింత దీటుగా ఎదుర్కొవాల్సిందన్నాడు. ముంబైతో మ్యాచ్లో ఆయుష్ మాత్రే బ్యాటింగ్ బాగుందని ధోనీ ప్రశంసించాడు.