
చెన్నై: సీఎస్కే మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు ఎందుకు దిగుతున్నాడో తనకు అర్థం కావడం లేదని ఆసీస్ మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ అన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో మహీ ముందుకు రావాలని సూచించాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ధోనీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చకచకా 30 రన్స్ బాదాడు. కానీ అప్పటికే సీఎస్కే ఓటమి ఖరారు కావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇప్పుడు ఇదే అంశంపై వాట్సన్ మాట్లాడాడు. ‘ధోనీ హిట్టింగ్ను ఫ్యాన్స్ ఆస్వాదిస్తారు. కాబట్టి అతను లైనప్లో ముందుకు రావాలని నేను కూడా కోరుకుంటున్నా. అశ్విన్ కంటే ముందే అతను బ్యాటింగ్కు దిగాలి.
ఆట పరిస్థితిని బట్టి చూస్తే మహీ మరో 15 బాల్స్ కూడా హిట్టింగ్ చేసేవాడు. గత రెండేళ్ల నుంచి అతని బ్యాటింగ్లో ఏమాత్రం పదును తగ్గలేదు. స్థిరంగా ఆడుతున్నాడు. ఎంఎస్ పూర్తి నైపుణ్యాలను చూడాలంటే ఆర్డర్లో పైకి రావాలి’ అని వాట్సన్ వివరించాడు. అయితే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగడం ధోనీకి ఇదే మొదటిసారి కాదు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతను ప్రతి మ్యాచ్లో లోయర్ ఆర్డర్లోనే ఆడుతున్నాడు. సీఎస్కే టాప్, మిడిలార్డర్ గాడిలో పడటం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు.
‘చెన్నై తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు చాలా నిరాశను కలిగిస్తున్నాయి. రాహుల్ త్రిపాఠితో ఓపెనింగ్ చేయడం ఒకటి. రుతురాజ్ నైపుణ్యం ఉన్న ఓపెనర్. కానీ ఒత్తిడి వల్ల ఫెయిల్ కావాల్సి వచ్చింది. దీపక్ హుడా ప్లేస్ కూడా సరైంది కాదు. ఐదో ప్లేస్లో సామ్ కరన్ రావడం కూడా ప్రశ్నార్థకంగా కనిపించింది. అతను ఏడో స్థానంలో బ్యాటింగ్కు రావాలి. ప్రస్తుతానికైతే సీఎస్కే బ్యాటింగ్ కాంబినేషన్ ఏమాత్రం బాగాలేదు. కచ్చితంగా సర్దుబాట్లు చేసుకోవాలి. ఇదే బ్యాటింగ్ లైనప్తో కొనసాగితే కచ్చితంగా ప్రమాదంలో పడతారు’ అని వాట్సన్ పేర్కొన్నాడు.