
- అబద్ధాలకు బీఆర్ఎస్ నేతలు అలవాటుపడ్డరు: విజయరమణారావు
- కేసీఆర్లా మా పార్టీలో ఇంజనీర్లు ఎవరూ లేరని కామెంట్
- పదే పదే అడ్డుతగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు
- కాళేశ్వరంలో అదీ మేడిగడ్డలో ఒక్క పిల్లరే కుంగిందని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు, రేషన్ కార్డుల విషయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య డైలాగ్ వార్ జరిగింది. బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లలోనే కూలిపోయిందని, వాళ్ల హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా విజయరమణారావు విమర్శలు గుప్పించారు.
ఈ సమయంలోనే హరీశ్ రావు పదే పదే కల్పించుకుంటూ విజయరమణా రావు స్పీచ్కు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. మైక్ఇవ్వాలని పట్టుబట్టారు. స్పీకర్ మైక్ ఇవ్వడంతో ఆ రెండు అంశాలపై హరీశ్ రావు తన వెర్షన్ వినిపించారు.
మూడేండ్లకే మేడిగడ్డ కూలింది: విజయరమణారావు
రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మూడేండ్లకే మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయిందని విజయ రమణారావు అన్నారు. కూలినా.. పగిలినా అది కూలినట్టేనని తెలిపారు. కేటీఆర్, హరీశ్ రావులు.. ఎక్కడికిపోయినా కాళేశ్వరం నీళ్లేనని చెప్పేటోళ్లని విమ ర్శించారు. ‘‘మా పార్టీలో కేసీఆర్లాగా ఇంజనీర్లు ఎవరూ లేరు. మా సీఎం, మా మంత్రులు ఇంజనీర్లు కాదు. నిపుణుల కమిటీపైనే ఆధారపడ్డారు.
.నాడు సీఎంగా ఉన్న కేసీఆరే స్వయంగా తానే ఇంజనీర్నని చెప్పుకున్నారు. కానీ, మూడేండ్లకే బ్యారేజీ కుంగింది. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మీ హయాం లోనే కుంగింది. ఏ మొహం పెట్టుకుని కేటీఆర్ పాదయాత్ర చేస్తామంటున్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ వాళ్లు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. గ్రూప్స్ ఎగ్జామ్స్ పెట్టలేదు. పెట్టిన ఒక్కసారి వాళ్లే పేపర్ లీక్ చేశారు. బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెప్పేందుకు అలవాటు పడ్డారు’’ అని ఆయన మండిపడ్డారు.
ఒక్క బ్లాకులోఒక్క పిల్లరే కుంగింది: హరీశ్రావు
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందనే ప్రచారం సరికాదని హరీశ్ రావు అన్నారు. ‘‘మేడిగడ్డలో ఒక్క పిల్లర్ కుంగినంతదానికే మామీద కోపంతో కాళేశ్వరం కూలిందని దుష్ర్పచారం చేయడం సరికాదు. మహబూబ్నగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పడం మంచిది కాదు.
నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లాను. అక్కడే నిద్ర చేసి ప్రాజెక్టులను పూర్తి చేసినం. బీఆర్ఎస్ హయాంలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చాం. 20,69,033 మంది కొత్త సభ్యులను చేర్చాం. ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పడం సరికాదు. ఈ విషయాల్లో సభ రికార్డులను సరిచేయాలి’’ అని ఆయన అన్నారు.
ఒక పిల్లర్ కూలితే బిల్డింగ్ నిలబడ్తదా?: మంత్రి పొన్నం
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘ ఒక బిల్డింగ్లో ఒక పిల్లర్ కూలిపోతే నిలబడుతుందా?” అని హరీశ్రావును ప్రశ్నించారు. మేడిగడ్డలో ఒక పిల్లర్ మాత్రమే కుంగిందంటూ బీఆర్ఎస్ వాళ్లు చెప్పడం కరెక్ట్ కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఏం చేస్తారన్నది సంబంధిత మంత్రి చెప్తారని ఆయన పేర్కొన్నారు. మేడిగడ్డ కుంగిందంటూ బీఆర్ఎస్ వాళ్లే స్వయంగా ఒప్పుకున్నారని అన్నారు.