- 25 వేల లీటర్ల డీజిల్ నేలపాలు
- హనుమకొండ జిల్లాలో ప్రమాదం
ఆత్మకూరు వెలుగు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం జాతీయ రహదారిపై నీరుకుల్ల క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. శుక్రవారం ములుగు జిల్లా పస్రా నుంచి హనుమకొండకు వస్తున్న ఆర్టీసీ బస్సును ములుగు వైపు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది . ట్యాంకర్ డ్రైవర్ వేరే వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా జెర్రిపోతుల వాగు మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సును అతివేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. ట్యాంకర్ బోల్తా పడడంతో 25 వేల లీటర్ల డీజిల్ వృధాగా పోయింది.
వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు డీజిల్ ట్యాంకర్తో అగ్ని ప్రమాదం జరగవచ్చని గుర్తించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. డీజిల్ ట్యాంకర్ చుట్టూ నీరు వదిలారు. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్, కండక్టర్ తీవ్రంగా గాయపడగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. బస్సును డ్రైవర్ అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై గంటసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. మేడారం వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.