
- మండల, పట్టణ అధ్యక్షుల నియామకంపై సీనియర్ల ఫైర్
- మెదక్, నర్సాపూర్ సెగ్మెంట్లలో గ్రూప్ విభేదాలు
మెదక్, వెలుగు: జిల్లా కాంగ్రెస్ పార్టీ లో కయ్యం మొదలైంది. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. సొంత పార్టీ నేతలపైనే పరస్పర విమర్శలు, ఆరోపణలతో హైకమాండ్కు ఫిర్యాదులు చేయడం చర్చనీయాంశంగా మారింది. తిరుపతిరెడ్డి వర్సెస్ సుప్రభాత్ రావ్జిల్లాలో కాంగ్రెస్ మండల, పట్టణ కమిటీలకు ఇటీవల కొత్త అధ్యక్షులను నియమించారు. అప్పటి నుంచే విభేదాలు షురూ అయ్యాయి. మెదక్ నియోజకవర్గంలోని మండల, పట్టణ కమిటీ అధ్యక్షుల నియామకంలో ముఖ్య నాయకులు అభిప్రాయం తీసుకోకుండా డీసీసీ ప్రసిడెంట్ తిరుపతిరెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారని రామాయంపేటకు చెందిన టీసీసీసీ మెంబర్ చౌదరి సుప్రభాత్ రావ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజొద్దీన్ ఆరోపిస్తున్నారు. ఇందుకు నిరసనగా.. మెదక్ టౌన్, ఆయా మండలాలకు చెందిన కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు వెళ్లి గాంధీభవన్ వద్ద ధర్నా చేశారు.
ఏకపక్షంగా నియమించిన కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీసీసీ ప్రసిడెంట్ తిరుపతిరెడ్డి టీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్గా పనిచేస్తున్నారని ఆరోపించారు. కాగా ఈ ఆరోపణలను తిరుపతిరెడ్డి ఖండించారు. తనను కోవర్టు అన్నవాళ్లు దమ్ముంటే పచ్చిబట్టలతో గుడిమీదకు రావాలని సవాల్ విసిరారు. పార్టీకోసం కష్టపడి పని చేస్తున్నవారినే అధ్యక్షులుగా నియమించామన్నారు. ఇదిలా ఉండగా సుప్రభాత్ రావ్ డీసీసీ ప్రసిడెంట్ తిరుపతిరెడ్డి మీద చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మండలాల, మెదక్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రామాయంపేటలో ధర్నా నిర్వహించారు. గత కొద్ది రోజులుగా తిరుపతిరెడ్డి, సుప్రభాత్ రావ్ ఫాలోవర్స్ మధ్య వాట్సప్ గ్రూపుల్లో విమర్శల వార్ నడుస్తోంది.
రాజిరెడ్డి వర్సెస్ అనిల్ కుమార్
నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ మండల కమిటీల నియామకం విభేదాలకు ఆజ్యం పోసింది. ఈ సెగ్మెంట్ లో పీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, టీపీసీసీ వైస్ ప్రసిడెంట్, మెదక్ పార్లమెంట్ ఇన్ చార్జి అనిల్ కుమార్ వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇటీవల వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉప్పు లింగాపూర్ గ్రామానికి చెందిన మహేశ్రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. కాగా ఈ విషయంలో ఆవుల రాజిరెడ్డి, గాలి అనిల్ కుమార్ వర్గీయుల మధ్య హైద్రాబాద్లో వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా రాజిరెడ్డి వర్గీయులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు, దాడికి యత్నించినట్టు గాలి అనిల్ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం సూచనల మేరకు డీసీసీ ప్రసిడెంట్ తిరుపతిరెడ్డి వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, టీపీసీసీ మత్స్య విభాగం రాష్ట్ర కార్యదర్శి, కుకునూరు మాజీ సర్పంచ్ మల్లేశం, కలాన్శెట్టిపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామం ఇరు వర్గాల మధ్య విబేదాలు మరింత పెంచినట్టయింది. రాజిరెడ్డి, అనిల్ కుమార్ మధ్య నెలకొన్న విభేదాలు ఇటీ డీసీసీ, అటు పీసీసీకి తలనొప్పిగా మారాయి.
జహీరాబాద్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్తి ఎవరో?
సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు : జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది తేలడం లేదు. మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డి ఈసారి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే జహీరాబాద్ నుంచి ఎవరు పోటీ చేయాలనుకున్నా గీతారెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. మరో నేత నియోజకవర్గ ఇన్చార్జి నరోత్తం ఇటీవల సీఎం సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ నేత ఎ.చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరితే జహీరాబాద్ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అయితే జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని చంద్రశేఖర్ కొద్దిరోజుల కింద సర్వే చేయించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పరిస్థితిపై అంచనా వేయడంతో పాటు , బీఆర్ఎస్ అసంతృప్తుల గురించి కూడా ఆరా తీసినట్టు వినిపిస్తోంది. తన సొంత నియోజకవర్గం వికారాబాద్ కు ఆనుకుని జహీరాబాద్ సెగ్మెంట్ ఉండడం ఈ ప్రాంతంలోని వారితో చంద్రశేఖర్ కు పరిచయాలు ఉండడం కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి.