
- ఉమ్మడి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా కొత్తగూడెం సెలెక్ట్
- డ్రోన్తో డిజిటల్ సర్వే వచ్చే 50 ఏండ్లకు ఉపయోగపడేలా మాస్టర్ ప్లాన్ రూపకల్పన
- సర్వే మొదలు పెట్టిన సర్వే ఆఫ్ ఇండియా టీమ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :అమృత్ 2.0 స్కీంలో భాగంగా డిజిటల్ సర్వేకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కొత్తగూడెం టౌన్ సెలెక్ట్అయింది. వచ్చే 50 ఏండ్లకు ఉపయోగపడేలా మాస్టర్ ప్లాన్ను రూపొందించనున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది సాయంగా సర్వే ఆఫ్ ఇండియా టీమ్ శనివారం నుంచి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగంగా డిజిటల్సర్వేను చేపట్టింది. ఇది మూడు రోజుల పాటు కొనసాగనుంది.
పట్టణంలో లక్షకుపైగా జనాభా..
సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లైన ఇల్లెందు తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలోనే బొగ్గు బావులు విస్తరించి ఉన్నాయి. ఈ క్రమంలోనే సింగరేణి హెడ్డాఫీస్ను కొత్తగూడెంలోనే ఏర్పాటు చేశారు. బొగ్గు బావుల్లో పనిచేసే వారు ఎక్కడ పడితే అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.
ప్రస్తుతం లక్షకు పైగా జనాభా కొత్తగూడెం టౌన్లో ఉంది. కానీ 50 ఏండ్ల నాటి మాస్టర్ ప్లాన్నే ఆఫీసర్లు అమలు చేస్తున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత1974లో మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు. మధ్య మధ్యలో మాస్టర్ ప్లాన్ అంటూ ఆఫీసర్లు హడావుడి చేసినా సమగ్రమైన మాస్టర్ ప్లాన్ ను మాత్రం రూపొందించలేదనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో కొత్తగూడెం పట్టణం అమృత్ 2.0 స్కీమ్కు సెలెక్ట్ కావడంతో వచ్చే 50 ఏండ్లకు ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం సాయంతో సెంట్రల్ గవర్నమెంట్ డిజిటల్ మాస్టర్ ప్లాన్ను రూపొందించే పనికి శ్రీకారం చుట్టింది.
ఇరుకు రోడ్లు, అడ్డదిడ్డంగా నిర్మాణాలు..
జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత కొత్తగూడెంలో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. వెహికల్స్ పెరిగాయి. పార్కింగ్ జోన్లు లేక రోడ్లపైనే వెహికల్స్ను పెట్టుకోవాల్సిన పరిస్థితి. మరో వైపు అడ్డదిడ్డంగా ఇండ్లు, కమర్షియల్ నిర్మాణాలు జోరుగా సాగాయి. ఎంజీ రోడ్ నుంచి చిన్న బజార్, అక్కడి నుంచి పెద్ద బజార్కు, లేపాక్షి హోటల్ రోడ్ నుంచి ఎంజీ రోడ్కు వెళ్లేందుకు ప్రజల సౌకర్యార్థం దశాబ్దాల కాలం నాడు గల్లీలను ఏర్పాటు చేశారు. టౌన్ప్లానింగ్ఆఫీసర్లు నిర్లక్ష్యంగా ఉండడంతో ఎవరికి వారు చాలా వరకు గల్లీలను ఆక్రమించుకున్నారు.
రెసిడెన్షియల్ప్రాంతాలు కమర్షియల్ జోన్లుగా మారాయి. ఏదేని అగ్ని ప్రమాదం జరిగితే కొన్ని ప్రాంతాలకు ఫైరింజన్ కూడా పోలేని దుస్థితిలో రోడ్లున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఐదు దశాబ్దాలకు సరిపోయే విధంగా సర్వే ఆఫ్ ఇండియా టీమ్మాస్టర్ ప్లాన్కు రూపకల్పన చేస్తోంది. ఎక్కడెక్కడ రెసిడెన్షియల్ ఏరియాలు, కమర్షియల్ ప్రాంతాలు, చెరువులు, ఖాళీ స్థలాలతో పాటు అగ్రికల్చర్ ల్యాండ్స్ లాంటి పలు అంశాలను డిజిటల్ సర్వేలో గుర్తించనున్నారు.