
జైపూర్,వెలుగు: జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో నిర్మించనున్న 800 మెగావాట్ల మూడో యూనిట్ నిర్మాణాన్ని గడువులో పూర్తిచేయాలని డైరెక్టర్ ఈ అండ్ ఎం డి.సత్యనారాయణ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వీ సూర్యనారాయణ ఆదేశించారు. గురువారం ఎస్టీపీపీ అడ్మిన్ బిల్డింగ్లో బీహెచ్ఈఎల్ సంస్థ ఈడీ వినోద్ జాకబ్ సామ్, ఎస్టీపీపీ ఇన్చార్జి ఈడీ శ్రీనివాసులు, అధికారులతో సైట్ మీటింగ్ నిర్వహించారు.
మూడో యూనిట్ నిర్మాణానికి టెక్నికల్ రివ్యూస్, కన్స్ట్రక్షన్ షెడ్యూల్, క్వాలిటీ, ఆడిట్, ప్రణాళికలు, బిల్లింగ్పై చర్చించారు. యూనిట్ నిర్మించే ప్రదేశంలో సాయిల్టెస్ట్,సైట్ మొబిలైజేషన్ వర్క్స్ వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జీఎంలు సుభాని, సుబ్బారావు, సూర్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.