
కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘భారతీయుడు 2’. జులై 12న వరల్డ్వైడ్గా సినిమా విడుదల కానుంది. శనివారం సాయంత్రం చెన్నైలో గ్రాండ్గా ఆడియో లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో శింబు, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, నెల్సన్, నిర్మాత ఏ ఎం రత్నం, ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్ ముఖ్య అతిథులుగా హాజరై మూవీ టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పారు. శృతి హాసన్, మౌనీ రాయ్, శంకర్ కూతరు అదితీ శంకర్, కొడుకు అర్జిత్ శంకర్ లైవ్ పెర్ఫార్మెన్స్లు అందరినీ ఆకట్టుకున్నాయి.
కమల్ హాసన్ మాట్లాడుతూ ‘ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్గా రావడం ఆనందంగా ఉంది. ఎన్నో సవాళ్లు ఎదురైనా సుభాస్కరన్ మాకు అండగా నిలిచారు. ఆయన మాపై పెట్టిన నమ్మకమే ఈ చిత్రం. అలాగే మాకు సపోర్ట్ చేసిన ఉదయనిధి స్టాలిన్, తమిళ కుమరన్, సెంబగ మూర్తికి థ్యాంక్స్. కాజల్, రకుల్, సిద్దార్థ్, ఎస్ జే సూర్య, సముద్రఖని ఇలా అందరూ అద్భుతమైన పాత్రలు పోషించారు’ అని చెప్పారు.
శంకర్ మాట్లాడుతూ ‘ఇండియన్ తాత మంచి వాళ్లకు మంచివాడు.. చెడ్డవాళ్లకు చెడ్డవాడు. ఇలాంటి పాత్రను కమల్ హాసన్ చేయడం మామూలు విషయం కాదు. ఆయన 360 డిగ్రీ కంటే ఒక డిగ్రీ ఎక్కువగా నటించే సత్తా ఉన్న నటుడు. ఆయనలాంటి యాక్టర్ ఈ ప్రపంచంలోనే లేరు. ఆయనతో ఇండియన్ 2, ఇండియన్ 3 చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. హీరోయిన్స్ కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, నటులు బ్రహ్మానందం, బాబీ సింహా ఈ చిత్రంలో నటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.