
- అనుచరులకు టికెట్లు దక్కకపోవడంపై దామోదర రాజనర్సింహ నారాజ్
- రోజంతా నాటకీయ పరిణామాలు
సంగారెడ్డి, వెలుగు : పటాన్చెరు, నారాయణఖేడ్ కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుపై ఆ పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. సోమవారం రాత్రి వెలువడిన కాంగ్రెస్ ఫోర్త్లిస్టులో పటాన్చెరు నుంచి నీలం మధు, నారాయణఖేడ్ నుంచి సురేశ్ షెట్కార్ పేర్లు ఖరారైన సంగతి తెలిసిందే. దీంతో పటాన్చెరు, ఖేడ్ టికెట్లపై ఆశలు పెట్టుకున్న కాటా శ్రీనివాస్గౌడ్, పట్లోళ్ల సంజీవరెడ్డి అనుచరులు ఒక్కసారిగా ఆగ్రహోదగ్రులయ్యారు.
కాటా అనుచరులు సోమవారం అర్ధరాత్రి రేవంత్దిష్టి దిష్టిబొమ్మ దహనం చేయడంతో పాటు హైదరాబాద్లోని పీసీసీ చీఫ్ ఇంటిపై దాడి చేయడం కాంగ్రెస్పార్టీలో కలకలం రేపింది. మరోవైపు ఖేడ్టికెట్ఆశించి భంగపడ్డ సంజీవరెడ్డి అనుచరులు పార్టీ మారే ఆలోచన చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. మరోవైపు అనుచరులకు టికెట్లు దక్కకపోవడంపై నారాజ్గా ఉన్న దామోదర రాజనర్సింహ సీక్రెట్ మీటింగ్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
అసంతృప్తిలో దామోదర రాజనర్సింహా..
తాజా పరిణామాలపై పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా హైకమాండ్ తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పటాన్చెరు, నారాయణఖేడ్ స్థానాల్లో ఆయన ముఖ్య అనుచరులు కాటా శ్రీనివాస్గౌడ్, పట్లోళ్ల సంజీవరెడ్డి టికెట్అశించగా రెండుచోట్ల భంగపాటు తప్పలేదు. దీంతో తీవ్ర అసహనంతో ఉన్న దామోదర రాజనర్సింహా మంగళవారం మధ్యాహ్నం మనిపల్లి మండలం బుధేరా చౌరస్తాలో ఓ నాయకుడి ఇంట్లో తన అనుచరులతో రహస్య మీటింగ్ పెట్టి భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు తెలిసింది.
ఈ మీటింగ్లో నారాయణఖేడ్ టికెట్ ఆశించిన సంజీవరెడ్డి కూడా పాల్గొనడం విశేషం. విషయం తెలుసుకున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దామోదర్తో ఫోన్లో మాట్లాడి బుజ్జగించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఆ తర్వాతే రేవంత్ ఇంటివద్ద ఆందోళనకు దిగిన కాటా అనుచరులకు దామోదర్నచ్చజెప్పి శాంతింప జేసినట్లు తెలుస్తోంది.