
భారీ ఆశలతో బరిలోకి దిగిన తెలుగు అథ్లెట్లకు పారిస్ ఒలింపిక్స్ కలిసి రాలేదు. స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్, టీటీ ప్లేయర్ ఆకుల శ్రీజతో పాటు డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్ పతకం లేకుండానే వెనుదిరిగారు. మెగా గేమ్స్లో తెలంగాణ నుంచి షూటర్ ఇషా సింగ్, ఏపీ నుంచి అథ్లెట్లు యెర్రాజీ జ్యోతి, దండి జ్యోతికశ్రీనే పోటీలో మిగిలారు.
పారిస్: తెలంగాణ స్టార్ బాక్సర్, రెండుసార్లు వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్కు పారిస్ ఒలింపిక్స్లో నిరాశే ఎదురైంది. గురువారం జరిగిన విమెన్స్ 50 కేజీల ప్రిక్వార్టర్స్లో నిఖత్ 0–5తో ఆసియా గేమ్స్ మెడలిస్ట్ యు వు (చైనా) చేతిలో కంగుతిన్నది. దీంతో తొలి గేమ్స్లోనే పతకం గెలవాలన్న ఆమె మధ్యలోనే ఆగిపోయింది. అన్సీడెడ్గా బరిలోకి దిగిన ఇండియన్ బాక్సర్కు బౌట్లో ఏదీ కలిసి రాలేదు.
ప్రత్యర్థి పవర్ఫుల్ పంచ్ల ముందు తేలిపోయింది. వు యు కొట్టిన బ్లాక్స్ను అడ్డుకునేందుకు నిఖత్ కౌంటర్ అటాక్కు దిగినా సరైన పంచ్లు విసరలేదు. అద్భుతమైన ఫుట్వర్క్తో వు యు ఈజీగా తప్పించుకుంది. 1–4తో వెనకబడ్డ నిఖత్ రెండో రౌండ్లో కొన్ని స్ట్రయిట్ పంచ్ కొట్టింది. కానీ వు యు హుక్స్తో అడ్డుకట్ట వేసింది. ఓటమి తర్వాత ‘నన్ను క్షమించండి’ అంటూ నిఖత్ భావోద్వేగానికి గురైంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ 71 కేజీ ప్రిక్వార్టర్స్లో నిశాంత్ దేవ్ 3–2తో గాబ్రియెల్ రొడ్రిగ్వేజ్ టోనోరి (ఈక్వెడార్)పై గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించాడు.
తొలి ఓటమి..
ఒలింపిక్స్లో ఇండియా హాకీ టీమ్కు తొలి ఓటమి ఎదురైంది. పూల్–బి మ్యాచ్లో ఒలింపిక్ చాంపియన్ బెల్జియం 2–1తో ఇండియాపై నెగ్గింది. బెల్జియం తరఫున తిబియు స్టాక్బోరెక్ (33వ ని.), జాన్ జాన్ డోహ్మెన్ (44వ ని.) గోల్స్ చేయగా, అభిషేక్ (18వ ని.) ఇండియాకు ఏకైక గోల్ అందించాడు. రెండు విజయాలు, ఓ డ్రాతో ఇండియా ఇప్పటికే క్వార్టర్స్కు అర్హత సాధించింది. బెల్జియం కూడా నాకౌట్కు చేరింది. శుక్రవారం జరిగే పూల్ ఆఖరి మ్యాచ్లో ఇండియా... ఆస్ట్రేలియాతో తలపడుతుంది.
బాణం గురి కుదరట్లే..
పారిస్ గడ్డపై ఇండియన్ ఆర్చర్ల గురి కుదరడం లేదు. మెన్స్ వ్యక్తిగత రికర్వ్ తొలి రౌండ్లో ప్రవీణ్ జాదవ్ 0–6 (28–29, 29–30, 27–28)తో కావో వెంచావో (చైనా) చేతిలో ఓడాడు. మ్యాచ్లో ఇండియన్ ఆర్చర్ నాలుగుసార్లు 10/10 సాధించాడు. కానీ మూడు సెట్లలోనూ కావో ఒక్కో పాయింట్ ఆధిక్యంలో నిలిచి పూర్తి ఆధిపత్యం చూపెట్టాడు.
విష్ణు ముందుకు..
సెయిలింగ్లో విష్ణు శరవణన్ తొలి రెండు క్వాలిఫయింగ్ రేసుల్లో ఫర్వాలేదనిపించాడు. మెన్స్ డింగీ రేస్ 1, 2లో విష్ణు 44 పాయింట్లతో 25వ ప్లేస్లో నిలిచాడు. తొలి రేస్లో 10, రెండో రేసులో 34 పాయింట్లు సాధించాడు. విమెన్స్ డింగీ రేస్ 1లో నేత్ర కుమరన్ 6 పాయింట్లతో ఆరో ప్లేస్లో నిలిచింది.
రేస్ వాకర్లకు నిరాశ..
అథ్లెటిక్స్ తొలి రోజే ఇండియా అథ్లెట్లు నిరాశపర్చారు. విమెన్స్ 20 కి.మీ రేస్ వాక్లో ప్రియాంక 1:39ని, 55 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 41వ ప్లేస్లో నిలిచింది. వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో విమెన్స్ వాకర్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా 30 నిమిషాలు ఆలస్యంగా మొదలైన మెన్స్ విభాగంలోనూ వికాశ్ సింగ్ 1:22ని,36 సెకన్లతో, పరమ్జీత్ సింగ్ 1:23ని,48 సెకన్లలో టార్గెట్ను చేరారు. దీంతో 30, 37వ ప్లేస్తో రేస్ నుంచి నిష్క్రమించారు. ఇక అక్ష్దీప్ సింగ్ 6 కి.మీటర్లు నడిచిన తర్వాత రేస్ నుంచి వైదొలిగాడు. అతను రెండు రోజుల నుంచి కడుపు నొప్పి, జ్వరం, ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడని టీమ్ కోచ్ తెలిపారు.
వరల్డ్ నం.1 చేతిలో శ్రీజ ఓటమి
టీటీలో తొలి పతకంపై ఆశలు రేపిన తెలంగాణ ప్లేయర్ ఆకుల శ్రీజ ఒలింపిక్స్లో తన పోరాటాన్ని ముగించింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో శ్రీజ 0–4 (10–12, 10–12, 8–11, 3–11)తో వరల్డ్ నంబర్ వన్ సన్ యింగ్షా (చైనా) చేతిలో ఓడింది. తొలి గేమ్లో మాత్రమే పోటీ ఇచ్చిన తెలుగమ్మాయి తర్వాతి మూడు గేమ్ల్లో ప్రత్యర్థి ధాటిని తట్టుకోలేకపోయింది. వరుసగా పాయింట్లు సమర్పించుకుంది. ప్రతి గేమ్లో చైనా ప్లేయర్ ఆధిపత్యం చూపెట్టి గెలిచింది.