
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పూర్వమే హైదరాబాద్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు చేపట్టి 560 టీఎంసీల నీటిని కేటాయించింది. హైదరాబాద్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో నల్లగొండ, ఖమ్మం జిల్లాల కోసం 161 టీఎంసీల సామర్థ్యంతో సంకల్పించిన నందికొండ, మహబూబ్నగర్ జిల్లాకు 100 టీఎంసీల భీమా పథకం, 54.40 టీఎంసీల ఎగువ కృష్ణ(ప్రస్తుత ఆల్మట్టి) ప్రాజెక్టులు ముఖ్యమైనవి. 1956కు పూర్వం చేపట్టిన ప్రాజెక్టులన్నింటిని విధిగా పూర్తి చేయాలని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 107, 108 (1)(2) సెక్షన్ల ద్వారా పార్లమెంట్ నిర్దేశించింది. కానీ ఈ విషయంలో పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం 1969, ఏప్రిల్ 10న బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. ఇది కృష్ణా నదీ జలాల వివాదంపై మొదటి ట్రిబ్యునల్. ఈ ట్రిబ్యునల్కు ఆర్ఎస్ బచావత్ నేతృత్వం వహించడం వల్ల దీనిని బచావత్ కమిటీ అంటారు. ఇందులో డి.ఎం.భండారి, డి.ఎం.సేన్ సభ్యులు కాగా, ఆర్.పి.మర్వహ కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ కమిషన్ మొదటి తీర్పును 1973, డిసెంబర్ 24న, తుది తీర్పును 1976 మేలో వెలువరించింది. ఈ తీర్పుపై 2001, మే 31 చివరి వరకు ఎలాంటి పున:సమీక్ష జరపడానికి వీల్లేదు. కృష్ణా జలాల్లో 75శాతం నికర జలాలుగా గుర్తించారు. ఆ నీటిని బచావత్ ట్రిబ్యునల్ పంపిణీ చేసింది. ట్రిబ్యునల్ తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్కు వాటాగా 811 టీఎంసీలు నికర జలాలు లభించాయి. దానికి మించి లభించే మిగులు జలాలను రాష్ట్రం తాత్కాలికంగా ఉపయోగించుకోవచ్చని తెలిపింది.
పంపిణీలో అన్యాయం
బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నికర జలాల్లో అధిక భాగం తెలంగాణకు చెందాలి. కానీ, పాలకులు వివక్షపూరితంగా వ్యవహరించారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం 68.5శాతం ఉన్న తెలంగాణ ప్రాంతానికి 298.96 టీఎంసీల వాటా అంటే 36.86శాతం కేటాయించి తీవ్ర వివక్ష చూపించారు. మిగిలిన నీటిలో 367.34 టీంఎసీ కేటాయింపులు కోస్తాంధ్రకు సుమారు 45.29శాతం నీటిని కేటాయించారు. వాస్తవానికి కృష్ణానది పరీవాహక ప్రాంతం 13.11 శాతం మాత్రమే ఉండి అత్యధిక కేటాయింపులు పొందింది. 18.39శాతం కృష్ణా పరీవాహక ప్రాంతం ఉన్న రాయలసీమకు 144.70 టీఎంసీలు కేటాయించారు. ఇది సుమారు 17.84శాతంగా చెప్పవచ్చు. తెలంగాణకు కేటాయించిన 36.86శాతం నీరు అంటే 298.96 టీఎంసీల నీరు వాస్తవ వినియోగానికి వచ్చేసరికి అతికష్టంతో 120 టీఎంసీల నీరు మాత్రమే అందుతుంది. అంటే బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రానికి కేటాయించిన 811 టీంఎసీల్లో అతి కష్టం మీద తెలంగాణ ప్రాంతానికి కేవలం 15శాతం నీరు మాత్రమే లభ్యం అవుతుందని తెలుస్తోంది.
జల వనరుల తరలింపు
ప్రకాశం బ్యారేజ్: ఇది కేవలం కోస్తా ప్రాంతానికి మాత్రమే ఉపయోగపడే ప్రాజెక్టు. దీనికి కేటాయించిన నీరు 181.20 టీఎంసీలు. ఈ ప్రాజెక్టుకు 300 టీఎంసీల నీరు అందుతున్నట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. అంటే అదనంగా 150 టీఎంసీల నీరు విద్యుచ్ఛక్తి ఉత్పాదకత పేరుతో నాగార్జున సాగర్ నుంచి నీటిని తరలించారు.
రాజోలిబండ మళ్లింపు పథకం: ఈ పథకానికి కేటాయించిన నికర జలాలు 15.9 టీఎంసీలు. కానీ ఇప్పటివరకు 6 నుంచి 7 టీఎంసీల కంటే ఎక్కువ నీరు ఎప్పుడూ మహబూబ్నగర్కు ఇవ్వలేదు. ఈ కారణంగా రాజోలిబండ పథకం కింద సాగు కావాల్సిన 87,500 ఎకరాల భూమిలో చాలా వరకు బీడుగా మారిపోయింది.
శ్రీశైలం ప్రాజెక్టు: 1981లో అఖిలపక్ష ఒప్పందం ప్రకారం శ్రీశైలం కుడి కాలువ ద్వారా రాయలసీమకు 48 టీంఎసీల నీటిని, ఎడమ కాలువ ద్వారా తెలంగాణకు 50 టీఎంసీల నీటిని అందించాలి. 1983లో కుడి కాలువతో తెలుగు గంగను జోడించి దానికి గాలేరు–నగరి, హంద్రీ–నీవా పథకాలకు జతపరిచి, ఆ కాలువ సామర్థ్యాన్ని 48 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని వదలడానికి వీలుగా పెంచారు. శ్రీశైలం కుడిగట్టు కాలువకు తర్వాత 20 టీఎంసీల నికర జలాలను అదనంగా కేటాయించారు. ఎడమ కాలువకు కేటాయించిన నీటిని 26 టీఎంసీలకు కుదించి, కుడి కాలువ మాదిరి నికర జలాలు కాకుండా మిగులు జలాలకు పరిమితం చేసి, ఆ నీటిని నాగార్జునసాగర్లో వదిలి, అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా ఎలిమినేటి మాధవరెడ్డి పేరుతో ఉన్న కాలువలో పోయడానికి ప్రణాళికలు రూపొందించారు.
భీమా ప్రాజెక్టు: భీమా నదిపై ఈ ప్రాజెక్టు నిర్మించతలపెట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మహబూబ్నగర్ జిల్లాలో 2 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావచ్చు. దీని నిర్మాణానికి 50 సంవత్సరాల క్రితం అనుమతి లభించినా పూర్తికాలేదు.
బ్రిజేష్కుమార్ కమిటీ
ఇది కృష్ణా నదీ జల వివాదాలపై ఏర్పాటైన రెండో కమిటీ. ఈ కమిటీని 2004, ఏప్రిల్ 2న జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. జస్టిస్ ఎస్.పి.శ్రీవాస్తవ, జస్టిస్ డీకే సేథ్లు సభ్యులు. ఈ కమిటీ తుది తీర్పును 2010, డిసెంబర్ 31న వెలువరించింది. బ్రిజేష్ కుమార్ కమిటీ గత 47 సంవత్సరాల కాలాన్ని ఆధారంగా చేసుకొని 65శాతం నికర జలాలు ఉంటాయని భావించి ఈ తీర్పును వెలువరించింది. దీని ప్రకారం మొత్తం నీటి లభ్యత 2578 టీఎంసీలు. ఈ అవార్డ్ బైండింగ్ తేదీ 2050, మే 31 వరకు ఉంటుంది. అయితే డిపెండబిలిటీని అనుసరించి నికర జలాల నీటి లభ్యత మారుతుంది. ఈ ట్రిబ్యునల్ గుర్తించిన కృష్ణా నదీ నికర జలాలు 2578 టీఎంసీలు. కాగా మహారాష్ట్రకు 666 టీఎంసీలు, కర్ణాటకకు 908 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు1005 టీఎంసీలు కేటాయించారు. 2010లో ఇచ్చిన తీర్పు మేరకు మిగులు జలాల హక్కుపై ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో కేసు వేయడంతో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2013లో తన తీర్పును సవరించింది. అదే విధంగా 2014లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు 75శాతం నీటి లభ్యత ఆధారంగా జలాల పంపిణీ జరగాలని, మిగులు జలాల పంపిణీ బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం జరగాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువును ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. చివరగా 2016 అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మాత్రమే కృష్ణా జలాల పున: పంపిణీ పరిమితమని ఈ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు
ఏడో నిజాం కాలంలో 10 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో ఏలేశ్వరం ప్రాజెక్టును సిద్ధం చేశారు. 1954లో ఆంధ్ర, హైదరాబాద్లో ఉమ్మడి ప్రాజెక్టుగా నందికొండ ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందాలు చేసుకున్నాయి. కొత్త ఒప్పందం ప్రకారం సాగర్ ఎడమ కాలువ ద్వారా ప్రధానంగా హైదరాబాద్ రాష్ట్రానికి 132 టీఎంసీలు, కుడి కాలువల ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి 132 టీఎంసీల నీటిని అందించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత ఎడమ కాలువ నిర్మాణం చేపట్టి దాని సామర్థ్యాన్ని 132 టీఎంసీల నుంచి 106.2 టీఎంసీలకు తగ్గించి ఆంధ్ర ప్రాంతంలోనికి పొడిగించారు. నాగార్జున సాగర్ ద్వారా సుమారు 250 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని తరలిస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీంఎసీల నీటిలో కోస్తా ప్రాంతానికి 580 టీఎంసీల నీరు తరలించారు.