జడ్చర్ల మున్సిపాలిటీలో ముందు నుంచి వివాదాస్పదమే

జడ్చర్ల మున్సిపాలిటీలో ముందు నుంచి వివాదాస్పదమే
  • జడ్చర్ల మున్సిపాల్టీలో మూడేండ్లకే చైర్​పర్సన్​పై అవిశ్వాస తీర్మానం
  • కౌన్సిల్​లో చైర్​పర్సన్​ భర్త జోక్యంతో విసిగెత్తిపోయిన సొంత పార్టీ కౌన్సిలర్లు

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మున్సిపాల్టీలో మూడేండ్లుగా చైర్​పర్సన్  లక్ష్మి, కౌన్సిలర్ల మధ్య వివాదం నడుస్తోంది. చైర్​పర్సన్​ భర్త దోరేపల్లి రవీందర్  మున్సిపల్​ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే ఈ వివాదానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నరగా చైర్​పర్సన్​పై అవిశ్వాసం పెట్టేందుకు కౌన్సిలర్లు ప్రయత్నిస్తూ రాగా, బీఆర్ఎస్​కు చెందిన మాజీ ఎమ్మెల్యే సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణుగుతూ వచ్చింది. శనివారం నిర్వహించిన కౌన్సిల్​ మీటింగ్​లో చైర్ పర్సన్​ తీరుపై నిరసన వ్యక్తం చేసిన సభ్యులు, ఆ తరువాత కలెక్టర్​ను కలిసి అవిశ్వాసం పెట్టేందుకు వినతిపత్రం ఇవ్వడం హాట్​ టాపిక్​గా మారింది. 

మహబూబ్​నగర్, వెలుగు : జడ్చర్ల మున్సిపాలిటీలో కొందరు సభ్యులపై చాలా రోజులుగా అవినీతి ఆరోపణలున్నాయి. ఈ మున్సిపాల్టీలో 27 వార్డులుండగా, 23 చోట్ల బీఆర్ఎస్, రెండేసి చోట్ల కాంగ్రెస్, బీజేపీ గెలిచాయి. ఇటీవల బీజేపీకి చెందిన కౌన్సిలర్​ ఒకరు కాంగ్రెస్​ పార్టీలో జాయిన్​ కాగా, కాంగ్రెస్​ బలం మూడుకు చేరింది. అయితే కౌన్సిలర్ల బలం ఉన్న బీఆర్ఎస్​ చైర్​పర్సన్​ పీఠాన్ని దక్కించుకుంది. కానీ, పీఠాన్ని చేజిక్కించుకున్న కొద్ది రోజులకే చైర్ పర్సన్​పై సొంత పార్టీ కౌన్సిలర్ల నుంచే ఆరోపణలు వెల్లువెత్తాయి. సొంత పార్టీ కౌన్సిలర్లే రెండేండ్లుగా నిరసన గళం వినిపిస్తున్నారు.

గతంలో కూడా తమ ప్లాట్లను కబ్జా చేశారని చైర్ పర్సన్​ ఇంటి ముందు బాధితులు ఆందోళనకు దిగారు. జడ్చర్లలో ప్లాట్లను డబుల్​ రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారని, ఏండ్ల కింద కొన్న ప్లాట్లను కబ్జా చేస్తున్నారని పలు సందర్భాల్లో బాధితులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఓడిపోవడానికి జడ్చర్ల మున్సిపాల్టీలోని ఇష్యూలే కారణమనే టాక్​ కూడా ఉంది.

కాగా, కొద్ది రోజుల కింద జడ్చర్లలో పందుల తరలింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దాదాపు రూ.1.25 కోట్లు విలువ చేసే పందులను చైర్​పర్సన్​ భర్త మాయం చేసినట్లు అప్పట్లో ఆరోపణలు రాగా, దీనిపై పోలీస్​స్టేషన్​లో బాధితులు ఫిర్యాదు చేశారు. అలాగే కౌన్సిలర్లు కూడా ఆయన వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్నారు. కౌన్సిల్​ ఎజెండాను సభ్యులకు తెలియకుండా రూపొందించడం, ఇష్టారీతిన తీర్మానాలు చేయడంపై కొంత కాలంగా చైర్​పర్సన్​, కౌన్సిలర్ల మధ్య విభేదాలు ఉన్నాయి. దీనికితోడు అనుకూలంగా వారికి కాంట్రాక్టులు ఇవ్వడం, నిధులు ఇవ్వడం లాంటివి చేస్తుండడంతో విసిగిపోయిన కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు శనివారం కలెక్టర్​ను కలిసి వినతిపత్రం అందించారు.

టైం కోసం వెయిట్​ చేసి..

చైర్​పర్సన్​ భర్త వ్యవహారం నచ్చక కౌన్సిలర్లు చాలా సందర్భాల్లో అవిశ్వాసం పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఏడాదిన్నర కింద ఈ విషయంపై అప్పటి ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డితో అవిశ్వాసంపై కౌన్సిలర్లు చర్చించారు. కానీ, ఎలక్షన్లు దగ్గర్లో ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఆయన కౌన్సిలర్లకు సర్దిచెప్పి పంపించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే మళ్లీ చైర్​పర్సన్​తో పాటు వైస్​చైర్మన్​పై అవిశ్వాసం పెట్టేందుకు 21 మంది కౌన్సిలర్లు సమావేశమై చర్చించుకున్నారు.

ఈ విషయాన్ని లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకుపోగా, ఆయన కౌన్సిలర్ల నిర్ణయానికే వదిలేసినట్లు తెలిసింది. దీంతో టైం కోసం వెయిట్​ చేసిన కౌన్సిలర్లు కౌన్సిల్​ మీటింగ్​ నుంచి వాకౌట్​ చేసి చైర్​పర్సన్​పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. కాగా, జడ్చర్ల మున్సిపల్​ వైస్​చైర్మన్​ పాలాది సారిక యూ టర్న్​ తీసుకున్నారు. నిన్న మొన్నటి వరకు చైర్ పర్సన్​తో కలిసి ఉన్న ఆమెపై కూడా కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే కౌన్సిలర్లతో కలిసి పోవడంతో చైర్ పర్సన్​పైనే అవిశ్వాసం పెట్టారు.

ఇంకా రెండేండ్ల పదవీ కాలం..

జడ్చర్ల మున్సిపల్​ పీఠాన్ని బీసీ మహిళకు రిజర్వ్​ చేశారు. మూడేండ్ల పదవీ కాలం ముగియగా, ఇంకా రెండేండ్ల టైం ఉంది. అయితే  ప్రస్తుతం అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం కావడంతో చైర్​పర్సన్​గా ఎవరు రేస్​లో ఉన్నారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. ఇదిలాఉంటే మెజార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్​ పార్టీకి చెందిన వారున్నప్పటికీ, చైర్​పర్సన్​ ఎన్నికలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్​రెడ్డి సహకారం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆయన సమక్షంలో లక్కీ డిప్​ తీసి చైర్​పర్సన్​ను ఎన్నుకోవాలని ప్లాన్​ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే సహకరించే అవకాశం ఉంటుందని అంటున్నారు.