
బషీర్బాగ్, వెలుగు: భూదాన్ భూములను నిరుపేదలకు పంచాలని అఖిల భారత సర్వోదయ మండలి జాతీయ అధ్యక్షుడు వెదిరె అరవింద్రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశంలో భూదాన్ భూదాత వెదిరె రామచంద్రారెడ్డి కొడుకు వెదిరె ప్రోమోతిష్ చంద్రారెడ్డి, అఖిల భారత సర్వసేవ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు తోలుపునురి కృష్ణగౌడ్ పాల్గొన్నారు.
అరవింద్రెడ్డి మాట్లాడుతూ.. 1951లో పోచంపల్లిలో భూదాన్ ఉద్యమం మొదలైందని తెలిపారు. 75 ఏండ్లు పూర్తయినందున ఏడాదిపాటు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో వజ్రోత్సవాలు మొదలవుతాయని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరుగుతాయని చెప్పారు. జులై17న హైదరాబాద్లో లక్షమందితో ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. తక్షణమే తెలంగాణ భూదాన యజ్ఞ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.