తెలుగు యూనివర్సిటీ పేరు మార్చొద్దు

తెలుగు యూనివర్సిటీ పేరు మార్చొద్దు

యాదాద్రి, వెలుగు : పొట్టి  శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్చవద్దని జిల్లా ఆర్య వైశ్య సంఘం కోరింది. ఈ మేరకు శుక్రవారం అడిషనల్ కలెక్టర్​గంగాధర్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సంఘం లీడర్లు మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీ పేరును ప్రభుత్వం మారుస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయని తెలిపారు. పొట్టి  శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష కారణంగా తెలుగువారికి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు.

అలాంటి మహనీయుడి పేరు తీసేసి తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడతారని జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించారు. పేరు మార్చే ప్రయత్నాలు మానుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతకుముందు ధర్నా నిర్వహించారు. వినతిపత్రం అందజేసిన వారిలో పసునూరి నాగభూషణం, ఆకుల రమేశ్, చీకటిమల్ల రాములు, చందామహేందర్ గుప్తా, చెన్న మహేశ్, పసుపునూరి మనోహర్, నూనె వెంకటేశ్వర్లు ఉన్నారు.