పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు తప్పనిసరి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు  తప్పనిసరి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

పానుగల్, వెలుగు:  స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పారిశుధ్య కార్మికులకు వైద్య ఆరోగ్య పరీక్షలు, జీవన్ జ్యోతి, సురక్ష యోజన బీమా చేయించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.  శుక్రవారం ఉదయం డ్రై డే కార్యక్రమంలో భాగంగా బండపల్లి,, పానుగల్ గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో జరుగుతున్న డ్రై డే కార్యక్రమాలతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. అమ్మ ఆదర్శ స్కూల్  పనులు పూర్తి అయిన వాటి వివరాలు సోమవారంలోగా ఇవ్వాలని ఆదేశించారు.  గ్రామాల్లో ఉన్న పారిశుధ్య కార్మికులకు  వైద్య పరీక్షలతో పాటు జీవన జ్యోతి, సురక్ష యోజన బీమా చేయించుకున్నారా లేదా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం బండపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు.  శుక్రవారం పానుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.  ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై వివరాలు సేకరించారు. మండల ప్రత్యేక అధికారి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఉమాదేవి,  ఎంపీడీఓ గోవింద రావు, పంచాయతీ కార్యదర్శి వసంత, తహసీల్దార్ సుభాశ్ నాయుడు , డీటీ   అశోక్ నాయుడు, మెడికల్  ఆఫీసర్ చంద్రశేఖర్  అంగన్‌‌ వాడీ  టీచర్ ఆశ వర్కర్ తదితరులు ఉన్నారు.