
ఖమ్మం టౌన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హల్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు డాక్టర్. పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... తమ శాఖకు వచ్చిన అర్జీలను పరిశీలించి, పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. గ్రీవెన్స్ కు 60 వినతులు వచ్చాయన్నారు. పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు లు, భూ సమస్యలు, ఉపాధి కోసం ఇతరేతర సమస్యలపై ప్రజలు వినతులు అందజేశారు. డీఆర్వో పద్మశ్రీ, డీఆర్డీవో సన్యాసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో ఎన్. అరుణ పాల్గొన్నారు.
మార్చి 5 నుంచి కలెక్టరేట్ లో దివ్యాంగులకు ఉచితంగా భోజనం
జిల్లా కలెక్టరేట్కు వివిధ పనుల నిమిత్తం వచ్చే దివ్యాంగులకు ఉచిత భోజన సదుపాయాన్ని మార్చి 5 నుంచి అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు భోజనం పెడతామని కలెక్టర్ తెలిపారు. ఒక్కో భోజనానికి 80 రూపాయల క్యాంటీన్ కు చెల్లిస్తామన్నారు.
నెలకు ఒకసారి క్యాంటీన్ నిర్వాహకులకు బిల్లుల చెల్లిస్తామన్నారు. ఈ నెల 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రూపొందించిన పోస్టర్ ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్. పి. శ్రీజ తో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె. సత్యనారాయణ, మహిళా అధికారులు పాల్గొన్నారు.