8 నెలలుగా జాడలేని దిశ మీటింగ్​

 8 నెలలుగా జాడలేని  దిశ మీటింగ్​
  • ఏజెన్సీ ప్రాంతాల్లో ఫారెస్ట్​ పర్మిషన్స్​ రాక నిలిచిన డెవలప్​మెంట్​ వర్క్స్

​భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన దిశ(జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) మీటింగ్​  జాడ లేకుండా పోయింది. ప్రతి మూడు నెలలకోసారి రివ్యూ చేయాల్సి ఉండగా..  8 నెలలు అవుతున్నా మీటింగ్​ జరగడం లేదు.  ప్రధానంగా ఏజెన్సీలో  మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్రం  రూ. కోట్లలో ఫండ్స్​ స్తున్నా..  ఫారెస్ట్​ పర్మిషన్స్​ లేక ఏండ్ల కాలంగా పనులు అసంపూర్తిగా ఉంటున్నాయి. దీంతో ఏజెన్సీ వాసులకు కష్టాలు తప్పడం లేదు. 

జాడలేని దిశ రివ్యూ మీటింగ్​... 

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు 20కిపైగా అభివృద్ధి పథకాలపై ప్రతి మూడు నెలలకోసారి ఆఫీసర్లతో రివ్యూ చేసేందుకు దిశ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎంపీలతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు సెలెక్ట్​ చేసిన జడ్పీటీసీలు, ఎంపీపీలతో పాటు కో ఆప్షన్​ మెంబర్లు దిశ కమిటీలో మెంబర్లుగా ఉంటారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా దిశ కమిటీ చైర్మన్​గా మహబూబాబాద్​ ఎంపీ పోరిక బలరాం  చైర్మన్​గా వ్యవహరిస్తున్నారు.

  గత జనవరి తర్వాత  దిశ మీటింగ్​ జరగలేదు.  ఉపాధి హామీ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. సోషల్​ ఆడిట్లో అవి వెలుగులోకి వస్తున్నా రికవరీ  మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. కొత్తగూడెం(భద్రాచలం రోడ్​) రైల్వే స్టేషన్​ నుంచి పలు రైళ్లు తరుచూ రద్దు అవుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. యువతులతో పాటు గర్బిణులు, బాలింతలను రక్తహీనత వేధిస్తొంది. 

శ్యాంప్రసాద్​ ముఖర్జీ రూర్బన్​ మిషన్​, ప్రధాన మంత్రి ఉపాధి కల్పన స్కీంపై జిల్లా యువతకు పెద్దగా అవగాహన లేకుండా పోయింది. అవగాహన కల్పించడంలో పరిశ్రమల శాఖాధికారులు విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి, టెలికం సేవలు, అగ్రికల్చర్​, హార్టికల్చర్​ డిపార్ట్​మెంట్లపై రివ్యూ చేసి, అభివృద్ది , సంక్షేమ కార్యక్రమాలను దిశానిర్దేశం చేయాల్సి ఉంది. 

ఏజెన్సీ వాసులు ఇబ్బందులు

మావోయిస్ట్​ ప్రభావిత ప్రాంతాల్లో రూ. వందల కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులపై దిశ కమిటీ సమీక్షించాలి.   ఫారెస్ట్​ పర్మిషన్స్​ రాక పలు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. భద్రాచలం, ఇల్లెందు, పాల్వంచ డివిజన్లలో ఏండ్ల కాలంగా పనులు పూర్తి కాకపోవడంతో ఏజెన్సీ వాసులు ఇబ్బందులు పడ్తున్నారు. బ్రిడ్జీలు, రోడ్లు సగంలోనే ఆగిపోయాయి. నేషనల్​ హైవేలో భాగంగా జిల్లాలో నిర్మిస్తున్న రోడ్లు, బ్రిడ్జీలు నత్తతో పోటీ పడ్తున్నాయి. ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

 డ్రింకింగ్​ వాటర్​, ఫారెస్ట్​, ముద్రా లోన్స్​ వంటి పలు స్కీమ్స్​పై సమీక్షించాల్సి ఉంది. కొత్తగూడెంలోని మాతా, శిశు సంరక్షణ హాస్పిటల్​లో శిశు మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. వైద్య సేవలు సరిగా  అందడం లేదని రోగులు వాపోతున్నారు. ఎక్స్​రే, స్కానింగ్​ కోసం ఆరు కిలోమీటర్ల దూరంలోని గవర్నమెంట్​ హాస్పటల్​కు వెళ్లాల్సి వస్తోంది.  వీటిపై చర్చిద్దామంటే దిశ మీటింగ్​ పెట్టడం లేదని సభ్యులు వాపోతున్నారు.  ప్రాధాన్యత గల దిశ కమిటీ మీటింగ్​ను నిర్వహించేందుకు ఎంపీలతో పాటు జిల్లా ఆఫీసర్లు  చొరవ చూపాలి.