కొలతలతోనే స్కూల్ యూనిఫారాలు .. గతేడాది లోపాలను సరి చేస్తున్న జిల్లా విద్యాశాఖ

కొలతలతోనే స్కూల్ యూనిఫారాలు .. గతేడాది లోపాలను సరి చేస్తున్న జిల్లా విద్యాశాఖ
  • మండలాల వారీగా మహిళలకు స్టిచ్చింగ్ బాధ్యత
  • 6, 7 క్లాస్ బాయ్స్​కు నిక్కర్లకు బదులు ప్యాంట్లు
  • నిజామాబాద్​ జిల్లాలో 1.11 లక్షల మంది విద్యార్థులు
  • 4.89 లక్షల మీటర్ల క్లాత్​కు ఇండెంట్​ 

నిజామాబాద్, వెలుగు : సర్కారు బడుల విద్యార్థులకు కొలతలతో కూడిన యూనిఫారాలను అందజేసేలా జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది.  వేసవి సెలవుల తరువాత స్కూల్​ రీఓపెన్ కాగానే ఒక జత యూనిఫామ్ అందించేలా మెప్మా, సెర్ఫ్​ ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది మహిళా సంఘాలకు ఆలస్యంగా స్టిచ్చింగ్​ బాధ్యత అప్పజెప్పడం వల్ల తలెత్తిన లోపాలను సరిదిద్దే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.  ప్రస్తుతం విద్యార్థుల కొలతలు తీసుకుని, 2025–26  విద్యా సంవత్సరానికి యూనిఫారాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఆరుగురు మాస్టర్​ ట్రైనర్లతో ఈ నెలలో 28 మండలాల మహిళా సమాఖ్యలకు  స్టిచ్చింగ్​పై శిక్షణ ఇచ్చారు.  

యూడైస్ లెక్కల ఆధారంగా స్టూడెంట్స్ సంఖ్య కన్పర్మ్

జిల్లాలో 693 ప్రైమరీ, 116 అప్పర్​ ప్రైమరీ, 230 హైస్కుల్స్, 25 కేజీబీవీ, 10 ఆదర్శ తదితర పాఠశాలలు కలిపి మొత్తం 1,074 బడులు ఉన్నాయి. 1.11 లక్షల మంది విద్యార్థులు ఉండగా,  60,355 బాయ్స్​, 51,906 గర్ల్స్ ఉన్నారు. ఏటా 1 నుంచి 12వ తరగతి పిల్లలకు ప్రభుత్వం రెండు జతల యూనిఫారాలు ఇస్తుంది.  మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో గతేడాది స్టిచ్చింగ్​ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.  జూన్​ 6న స్కూల్స్​ప్రారంభం కాగా, మే నెల ఆఖరు వారంలో యూనిఫాం క్లాత్​ మహిళా సంఘాలకు చేరింది.  దీంతో హడావుడి స్టిచ్చింగ్​ చేసి ఇవ్వడంతో క్లాత్ వేస్ట్​ కాగా, లోడాసు నెక్కర్లు, బిర్రు అంగీలు వేసుకోలేక  సివిల్​ డ్రెస్​లతో విద్యార్థులు స్కూళ్లకు హాజరవుతున్నారు.  

ఈ సారి లోపాలను సరిచేసేందుకు రెండు జతల యూనిఫారాల కోసం 4.89 లక్షల మీటర్ల క్లాత్​ అవసరమని ఇండెంట్ పెట్టారు. ఈనెల 10వ తేదీలోపు జిల్లాకు క్లాత్ చేరగా, ప్రతి విద్యార్థి కొలతలు తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 28 మండలాల్లో మహిళా సమాఖ్యలు ఉండగా, మెప్మా, సెర్ఫ్​ ఆధ్వర్యంలో స్టిచ్చింగ్ పూర్తి చేసేలా శిక్షణ ఇచ్చారు.  3,604 మహిళా సంఘాలు జూన్​ నెలలో ఒక జత, ఆ తర్వాత  మరో జత యూనిఫామ్ కుట్టి ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు. 

నో డిజైన్ యూనిఫారాలు..

డిజైన్లు లేకుండా సాదాసీదాగా యూనిఫారాల రెడీ చేయాలని గవర్నమెంట్ ఆదేశించింది. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు షర్ట్, నెక్కర్లు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు షర్ట్​, ప్యాంట్లు, 1 నుంచి -3 తరగతి విద్యార్థినులకు బాడీ ఫ్రాక్​, షర్ట్​, 4- నుంచి 5వ క్లాస్​ గర్ల్స్​కు షర్ట్​, స్కర్ట్​, 6  నుంచి 12 తరగతుల అమ్మాయిలకు పంజాబీ డ్రెస్ విత్​ వాస్కోట్ పంపిణీ చేయనున్నారు. ఎంఈవోల పర్యవేక్షణలో ప్రతి స్కూల్​కు డ్రెస్​లు చేరాలని కలెక్టర్​ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి డ్రెస్​ స్టిచ్చింగ్​కు  రూ.75 లను ప్రభుత్వం  చెల్లించనుంది. 

జాగ్రత్తలు తీసుకుంటున్నాం..

గతంలో తలెత్తిన  లోపాలను సరిచేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కలెక్టర్​ పర్యవేక్షణలో స్కూల్​ యూనిఫారాలు రెడీ అవుతున్నాయి.  స్టూడెంట్స్​ కొలతల ప్రకారమే డ్రెస్సులు స్టిచ్చింగ్​ చేయిస్తున్నాం. స్టిచ్చింగ్​లో మార్పులుంటే ఎవరైతే కుట్టారో వారితోనే సరి చేయిస్తాం.

  శ్రీనివాస్​రావు, డీఈవో ఆఫీస్ సీఎంవో 

కొలతలు కంప్లీట్ చేస్తున్నాం

స్కూళ్ల వారీగా విద్యార్థుల కొలతలు సేకరిస్తున్నాం. గతేడాది మాదిరి కాకుండా ఈసారి పర్ఫెక్ట్​ సైజులతో స్టిచ్చింగ్​ చేయిస్తున్నాం.  మండలాల వారీగా కుట్టు మిషన్లు, బల్క్​ కట్టింగ్​ యంత్రాలు రెడీ చేశాం. క్లాత్ రాగానే స్టిచ్చింగ్ మొదలుపెడతాం. 

సాయిలు, డీపీఎం