
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్
సంగారెడ్డి టౌన్ ,వెలుగు : ఎన్నికలను సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ చెప్పారు. . శుక్రవారం సంగారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని, అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్స్ ను, స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్నారు. నిబంధనల మేరకు నడుచుకోవాలని తెలిపారు. కలెక్టర్ వెంట రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి, తహసీల్దార్లు, డీటీలు ఉన్నారు.
ఎన్నికల గ్రీవెన్స్ సెల్ విభాగం ఏర్పాటు
మెదక్ టౌన్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల గ్రీవెన్స్ సెల్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఇందులో డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్, జిల్లా ఆడిట్ ఆఫీసర్ రాకేశ్, జిల్లా ట్రెజరీ అధికారి చిన్నసాయిలు సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోసం నియమించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)లో భాగంగా స్టాటస్టిక్ సర్వేలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, వీడియో సర్వేలెన్స్ బృందాలు, వీడియో వీవింగ్ బృందాలు, ఎంసీసీ బృందాలతో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్లు పని చేస్తాయని తెలిపారు.
పోలీసులు తనిఖీల్లో ఎక్కడైనా ఎలాంటి రశీదు లేకుండా రూ.50 వేల కంటే ఎక్కువగా నగదు పట్టుబడితే సీజ్ చేయాలని సూచించారు. అలాగే రూ. లక్ష నుంచి రూ. పది లక్షల వరకు ఉన్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ఆఫీసర్లకు సమాచారం అందించాలన్నారు. పట్టుబడిన నగదుకు సరైన పత్రాలను, ఎన్నికల గ్రీవెన్స్ విభాగంలో సమర్పించి తమ నగదును తిరిగి పొందవచ్చని పేర్కొన్నారు. ఎవరికి అనుమానం ఉన్నా 1950 హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలన్నారు.