
మెదక్ టౌన్, వెలుగు: ఎన్నికలు సజావుగా జరగడానికి పొలిటికల్ పార్టీల అభ్యర్థులు సహకరించాలని జిల్లా సాధారణ పరిశీలకుడు పృథ్వీరాజ్ కోరారు. గురువారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాధారణ పరిశీలకుడు పృధ్వీరాజ్, వ్యయ పరిశీలకుడు సంజయ్ కుమార్, జిల్లా పోలీస్ పరిశీలకుడు సంతోష్ కుమార్ తుకారాం, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలని, రూ.10 వేల కంటే ఎక్కువ బ్యాంక్ నుంచి విత్ డ్రా చేసుకోవద్దన్నారు.
అభ్యర్థి ఖర్చు వివరాలు కచ్చితంగా నమోదు చేయాలన్నారు. సంతోష్ కుమార్ తుకారాం మాట్లాడుతూ.. ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించేలా రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సహకరించాలన్నారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. దాతలు చేసే సహాయ సహకారాలు, ఎన్నికల ప్రచార ఖర్చులు అభ్యర్థి ఖాతాలో జమ అవుతాయన్నారు. ఈ నెల 18న రెండో ర్యాండమైజేషన్ మెదక్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో, నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్లో నిర్వహిస్తున్నామన్నారు.
ALSO READ: కేటీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలి : జాన్సన్నాయక్
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి సమాచారం కోసం కేవైసీ (నో యువర్ క్యాండిడేట్) యాప్లో తెలుసుకోవచ్చని సూచించారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ.. ఎవరైనా ప్రచారాన్ని అడ్డుకుంటే డయల్100కు ఫోన్ చేయాలన్నారు .