
- కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంపీ డీకే అరుణ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని బెంగళూరు హైవేని ఆరు లేన్లుగా అప్గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బీజేపీ ఎంపీ డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో గడ్కరీ నేతృత్వంలో రోడ్డు రవాణా,- రహదారుల మంత్రిత్వశాఖ సంప్రదింపుల కమిటీ తొలి సమావేశం జరిగింది. దేశంలోని రోడ్లు, హైవేల నిర్మాణాలు, ట్రాన్స్ పోర్టు ప్రాజెక్టులు, ఇబ్బందులు, ప్రతిపాదనలపై భేటీలో చర్చించారు.
ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ పాలమూరుకు చెందిన పలు ప్రతిపాదనలను ప్రస్తావించారు. మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డు అనుమతులపై పురోగతి, పార్లమెంట్ పరిధిలోని హైవేలలో ప్రమాదాలు జరిగే చోట ఫ్లై ఓవర్ల నిర్మాణం, పురోగతి అంశాలను కమిటీ దృష్టికి తెచ్చారు. అలాగే కొత్తకోట నుంచి మంత్రాలయం రోడ్డు, గద్వాల మీదుగా నిర్మించే రోడ్డు ప్రతిపాదనల స్టేటస్ ను కూడా ఎంపీ అందించారు. గద్వాల జిల్లా ఎర్రవల్లి నుంచి రాయచూరు వరకు 4 లేన్లుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు.