
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: జీవో 21ని రద్దు చేసి కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. శనివారం పీయూలో కాంట్రాక్ట్ లెక్చరర్ల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 12 యూనివర్సిటీల్లో ధర్నాలు చేపట్టడం బాధాకరమని పేర్కొన్నారు.
న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నాలు చేస్తుంటే అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్ల గురించి మాట్లాడి, సీఎం కాగానే మర్చిపోయారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, 1,200 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలన్నారు. యూజీసీ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని తెలిపారు.
ఎంపీకి ఏబీవీపీ వినతి..
పీయూలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ నాయకులు ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేశ్ తేజ మాట్లాడుతూ కొత్తగా మంజూరైన లా, ఇంజనీరింగ్ కాలేజీలకు సౌలతులు కల్పించాలని, వసతిగృహాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హెల్త్ సెంటర్లో రెగ్యులర్ డాక్టర్ ను నియమించాలని, కొత్త అంబులెన్స్ మంజూరు చేయాలని కోరారు. యూనివర్సిటీ గేట్ ముందు బస్ స్టాప్ ఏర్పాటు చేయాలన్నారు. అర్జున్ కుమార్, కృష్ణ కుమార్, నగేశ్, సంగీత, తిరుమలేశ్ పాల్గొన్నారు.