
మహబూబ్నగర్, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నూతన బైపాస్ రోడ్ ను నిర్మించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరినీ పాలమూరు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలోని కేంద్రమంత్రిని ఆయన ఆఫీసులో కలిశారు. అనంతరం బైపాస్ రోడ్డును నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. గతంలో మున్సిపాల్టీగా ఉన్న మహబూబ్నగర్ ఇప్పుడు కార్పొరేషన్ గా మారిందన్నారు.
కొత్తగా విద్యాసంస్థలు, యూనివర్సిటీలు ఏర్పాటు అవుతున్నాయని, పట్టణానికి కేవలం ప్రధాన రహదారి ఒక్కటే ఉండడం, పెద్ద వాహనాలు పట్టణంలో నుంచే వెళ్లడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.