ఇండియాలో రెండో అత్యంత సంపన్నుడిగా రికార్డు
అవెన్యూ సూపర్ మార్ట్స్ ఓఎఫ్ఎస్కు భారీ సబ్ స్క్రిప్సన్
రేపు రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి ఆఫర్
న్యూఢిల్లీ: డీమార్ట్ ఫౌండర్ రాధాకిషన్ దమానీ ఇండియాలోని ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ తర్వాతి స్థానానికి చేరుకున్నారు. ఫోర్బ్స్ రియల్టైమ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ఆయన సంపద విలువ రూ. 1.28 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ఆయన ఇండియాలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ప్రమోటర్ల వాటాను విక్రయిస్తుండడంతో డీమార్ట్ షేరు గత వారంలో 5 శాతానికి పైగా ర్యాలీ చేసింది. దీంతో హెచ్సీఎల్ శివనాడార్(రూ. 1.18 లక్షల కోట్లు), ఉదయ్ కోటక్(రూ. 1.06 లక్షల కోట్లు), గౌతమ్ అదాని(రూ. లక్ష కోట్లు) వంటి సంపన్నులను ఆయనను అధిగమించారు. రిలయన్స్ అధిపతి ముఖేష్ అంబానీ రూ. 4.10 లక్షల కోట్ల సంపదతో మొదటి స్థానంలో ఉన్నారు. ఈ నెల ప్రారంభంలో అవెన్యూ సూపర్ మార్స్ట్ రెండు కోట్ల షేర్లను విక్రయించింది. దీంతో కంపెనీలో ప్రమోటర్ల వాటా డిసెంబర్లో 79.73 శాతం ఉండగా, ఈ అమ్మకంతో 77.27 శాతానికి తగ్గింది. ఈ ప్రకటన వచ్చిన తర్వాత నుంచి కంపెనీ షేరు పాజిటివ్గా ట్రేడవుతోంది. కాగా మరో 2.28 శాతం ప్రమోటర్ల వాటాను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయిస్తామని కంపెనీ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ప్రమోటర్ల వాటా 75 శాతం కంటే తక్కు వగా ఉండాలి.
కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ అదుర్స్..
నాన్ రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 1,33,20,000 షేర్లను కేటాయించగా, ఏకంగా 4,53,20,852 షేర్లకు సబ్ స్క్రిప్షన్ రావడం విశేషం. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ 14,80,000 షేర్లను కేటాయించింది. వీరు సోమవారం( ఫిబ్రవరి 17) బిడ్స్ వేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఫర్ సేల్లో ఫ్లోర్ ప్రైస్ను రూ.2,049 గా నిర్ణయించింది. ఇది ప్రస్తుత ధర కంటే 19 శాతం తక్కు వ. ఈ సేల్ ద్వారా రూ. 3,032.5 కోట్లను కంపెనీ సమీకరించనుంది. అవెన్యూ ప్రమోటర్లు ఈ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 1.48 కోట్ల షేర్లు విక్రయించనున్నారు. అవెన్యూ షేరు 2017 లో రూ. 299 వద్ద మార్కెట్లో లిస్టయ్యింది. శుక్రవారం(ఫిబ్రవరి 14) సెషన్లో కంపెనీ షేరు రూ. 2,380.20 వద్ద క్లోజయ్యింది. ప్రస్తుతం దీని మార్కెట్ క్యాపి టలైజేషన్ రూ. 1.60 లక్షల కోట్లు ఉంది.