గుండాయిపేట్​లో మీ ట్రీట్​మెంట్ ఆపేయండి : తుకారం భట్

గుండాయిపేట్​లో మీ ట్రీట్​మెంట్ ఆపేయండి : తుకారం భట్
  • గుండాయిపేట్​లో ఆర్ఎంపీలకు డీఎంహెచ్ఓ ఆదేశం
  • పేషెంట్లకు హై డోస్ ​స్టెరాయిడ్లు, పెయిన్ ​కిల్లర్లు ఇస్తున్నట్లు గుర్తింపు
  • ఆర్డీవో, డీపీఓతో కలిసి గ్రామంలో పర్యటన
  • మృతులు పూజ, కాళిదాస్​కుటుంబాలకు పరామర్శ
  • ఓ ఆర్ఎంపీ దగ్గర ఎక్స్​పైరీ అయిన సిరప్​లు లభ్యం

కాగజ్ నగర్, వెలుగు: ఆర్ఎంపీలు స్థాయికి మించి ట్రీట్​మెంట్​ఇస్తున్నారని డీఎంహెచ్​ఓ తుకారం భట్​ ఫైర్​ అయ్యారు. ఇంజెక్షన్లు, పెయిన్​కిల్లర్లపై సరైన పరిజ్ఞానం లేకుండానే ఇస్తున్నారని మండిపడుతూ.. తదుపరి ఆదేశాల మేరకు గ్రామంలోని ఆర్ఎంపీలు ఎవరూ రోగులకు ట్రీట్​మెంట్​ఇవ్వొద్దని ఆదేశించారు. రెండ్రోజుల క్రితం కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేట్​లో ఇటీవల జ్వరంతో ఇద్దరు మృతిచెందిన నేపథ్యంలో కలెక్టర్ వెంకటేశ్ ​ధోత్రే ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. 

సోమవారం ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్​లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఆర్డీవో సురేశ్, డీపీఓ బిక్షపతి గౌడ్​తో కలిసి పరిశీలించారు. జ్వరాలు, కీళ్లు, కాళ్ల నొప్పు లతో బాధపడేవారి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని జిల్లా కేంద్రంలోని టీ హబ్​కు పంపించారు. మృతులు జాడే పూజ(16), భోయర్ కాళిదాస్(32) కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.

మెడికల్ ​షాప్​లో భారీగా మందులు.. 

గ్రామంలో ఇటీవల జ్వరాలు, ఇతర వ్యాధులు రాగా స్థానిక ఆర్ఎంపీలు ఇష్టారీతిన ట్రీట్​మెంట్​ అందించారని స్థానికులు డీఎంహెచ్ఓ, ఆర్డీవో దృష్టికి తీసుకువచ్చారు. దీంతో గ్రామంలోని ఆర్ఎంపీల దగ్గరికి వెళ్లి ఎలాంటి ట్రీట్​మెట్ చేస్తున్నారో అడిగి నోట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే గోవర్ధన్​ సర్కార్ (జీడీ) అనే ఆర్ఎంపీ క్లినిక్​లో తనిఖీ చేయగా 4 నెలల క్రితమే ఎక్స్​పైరీ అయిన రెండు సిరప్​లను గుర్తించారు. అదేవిధంగా క్లినిక్​లో ఆయుర్వేదం, హాలోపతి, హోమియో మందులను గుర్తించారు. వీటన్నింటినీ మీరే ఇస్తారా అని అడిగితే ఆర్ఎంపీ అవునని సమాధానం ఇవ్వడంతో డీఎంహెచ్ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఊరిలో ఉన్న ఏకైక మెడికల్ షాప్​లో భారీ మొత్తంలో మందులు స్టోర్ చేసి ఉండడం, ఎలాంటి పేర్లు లేకుండా చిట్టీల మీద ప్రిస్క్రిప్షన్ రాసి ఉండడాన్ని గుర్తించి అక్కడి బుక్స్, రిజిస్టర్​ను సీజ్ చేశారు.

సర్కార్ దావాఖానలో స్టాఫ్ లేరు..ఆర్ఎంపీలను కూడా బంద్ చేస్తే ఎట్లా ?

‘ఇక్కడి ఆరోగ్య మందిరంలో డాక్టర్ లేడు, కనీసం సిబ్బంది కూడా లేరు. ఇప్పుడు ఆర్​ఎంపీలను కూడా ట్రీట్​మెంట్​చేయొద్దని ఆదేశిస్తే ఇప్పుడు మాకు ఏమైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్లాలి’ అని గ్రామస్తులు, మహిళలు డీఎంహెచ్ ఓ, అధికారులను ప్రశ్నించారు. అత్యవసరమైతే ఏం చేయాలి అని అడిగారు. ఆర్​ఎంపీలు ట్రీట్​మెంట్ ​అందించకుండా ఆదేశాలివ్వడం సరికాదన్నారు. దీనిపై డీఎంహెచ్ఓ స్పందిస్తూ.. ఆర్ఎంపీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ట్రీట్​మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని, అర్హతకు మించి వైద్యం చేయడం నేరమన్నారు. గ్రామస్తులకు సరైన ట్రీట్​మెంట్ అందించేందుకు వైద్య శాఖ తరఫున కృషి చేస్తానని, త్వరలోనే  డాక్టర్, సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.