
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడిన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో నగదు తరలింపుపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. అయితే ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నియంత్రించేందుకు అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో రూ. 50 వేలకు మించి నగదు తరలించే సామాన్య ప్రజానీకం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు అధికారులు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రూ. 50 వేలకు మించి డబ్బు తరలించిన సమయంలో.. అది అధికారులకు పట్టుబడితే తప్పనిసరిగా ఆధారాలు చూపించాలి. లేదంటే ఆ నగదును అధికారులు సీజ్ చేసి.. ఐటీ అధికారులకు అప్పగిస్తారు. ఒక్క నగదుకే ఆధారాలు తప్పనిసరి కాదు. బంగారం, వెండి కొనుగోలు చేసి తరలించినా పక్కా రశీదులు ఉండాలి. ఒక వేళ కొదవ పెట్టిన బంగారాన్ని విడిపించినా దానికి సంబంధించిన పేపర్లను వెంటనే ఉంచుకోవాలి. ఇక ఆస్పత్రుల్లో వైద్య ఖర్చుల కోసం భారీ మొత్తంలో డబ్బును తీసుకెళ్తుంటారు. ఇలాంటి వారు కూడా రోగి అడ్మిట్ అయిన ఆస్పత్రి రశీదులు.. ఇతర ఆధారాలను చూపిస్తే సరిపోతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి పక్కా ఆధారాలతో బయటకు వస్తే మంచిదంటున్నారు అధికారులు.
