తాడ్వాయి, వెలుగు : మేడారం జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా కాటన్ సంచులు వాడాలని ఐటీడీఏ పీవో అంకిత్ సూచించారు. ప్లాస్టిక్ను నిషేధించాలని కోరుతూ మేడారం గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల స్టూడెంట్లతో కలిసి ఆదివారం అమ్మవారి గద్దెల నుంచి జంపన్నవాగు మీదుగా మేడారం గ్రామం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ జాతరను ప్లాస్టిక్ రహితంగా మార్చాలని సూచించారు. ముందుగా అమ్మవారి గద్దెల వద్ద పూజలు చేసి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావుకు కాటన్ సంచులు అందజేశారు.
అనంతరం ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్లో రిపేర్లను పరిశీలించి పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు. జాతర సందర్భంగా పనుల పురోగతిపై ఆర్అండ్బీ డీఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలతో మాట్లాడారు. జంపన్న వాగు ఏరియాలో పార్కింగ్ ప్లేస్లు, ట్రాఫిక్ నిర్వహణ, స్నాన ఘట్టాలు, గిరిజన మ్యూజియంను సందర్శించారు. ఆయన వెంట ఏపీవో వసంతరావు, ఎండోమెంట్ ఈవో రాజేంద్రం, ట్రైబల్ డెవలప్మెంట్ ఏఈ దేశిరాం పాల్గొన్నారు.