
జనగామ, వెలుగు : టిప్పు సుల్తాన్ వారసుడిని, మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ను అని చెబుతూ కోట్ల రూపాయలు వసూలు చేసిన ఓ డాక్టర్ జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను టౌన్ సీఐ దామోదర్రెడ్డి సోమవారం వెల్లడించారు. తమిళనాడులోని తేని మండలం కుంభం గ్రామానికి చెందిన అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా (42) జనగామ పట్టణంలోని హన్మకొండ రోడ్డులో 2020లో కేకే హాస్పిటల్ను ఓపెన చేశాడు.
2010లో రష్యాలో ఎంబీబీఎస్ చేసిన ఆయన మొదటగా సంగారెడ్డి జిల్లాలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో సీఎంవోగా పనిచేశాడు. తర్వాత కరీంనగర్, హుస్నాబాద్లోని పలు హాస్పిటళ్లలో పనిచేశాడు. తన వద్దకు వచ్చే వారికి తాను టిప్పు సుల్తాన్ వారసుడినని, మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్గా సైతం కొనసాగుతున్నానని పరిచయం పెంచుకునేవాడు.
ఈ క్రమంలో జనగామకు చెందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎండీ.వసీం అక్తర్ను కలిసి కర్నాటక ప్రభుత్వం నుంచి తన మెమోరియల్ ట్రస్ట్కు రూ.700 కోట్లు వస్తున్నాయని ఓ డీడీ చూపించాడు. ఈ డబ్బులతో జనగామలో మెడికల్ కాలేజీ కడుతానని, ఆ బిల్డింగ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ ఇస్తానని నమ్మించి అక్తర్ నుంచి రూ. 1.17 కోట్లు తీసుకున్నాడు.
అలాగే ఈఎస్ఐలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, తన హాస్పిటల్లో ఎక్స్రే మిషన్లు, బెడ్స్, ప్రింటర్లు, కంప్యూటర్లు, ఇతర పరికరాల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని, ఇలా పలు రకాలుగా నమ్మిస్తూ పలువురి వద్ద లక్షల రూపాయలు తీసుకున్నాడు. చివరకు ఎలాంటి కాంట్రాక్టులు, ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులంతా తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో ఇప్పుడు, అప్పుడు అంటూ దాటవేస్తూ వచ్చాడు. ఇలా మొత్తం రూ. 5.56 కోట్లు వసూలు చేసిన అబ్దుల్ రహీం ఎనిమిది నెలల కింద జనగామ నుంచి పారిపోయాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అయితే సోమవారం అతడు జనగామకు వచ్చినట్లు తెలియడంతో అబ్దుల్ రహీంను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ దామోదర్ తెలిపారు.