
ఓ బాలుడికి కడుపులో అయస్కాంతాలు ఉన్నట్లు గుర్తించారు గుంటూరు జిల్లా డాక్టర్లు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన షేక్మహమ్మద్ రఫీ(9) కడుపు నొప్పి, పసరు వాంతులతో కొన్నాళ్లుగా పసరు వాంతులతో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు జులై 8న గుంటూరులోని యర్రాస్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్లు వివిధ పరీక్షలు నిర్వహించగా బాలుడి కడుపులో నాలుగు అయస్కాంతాలు ఒకదానికొకటి అతుక్కుని ఉన్నాట్లు గుర్తించారు.
ఇవి ఆకర్షించుకోవడంతో పేగుళ్లో రంధ్రాలు పడినట్లు గుర్తించారు. వీటితో పాటు ప్లాస్టిక్, రబ్బరు వస్తువులు, విత్తనాలు ఉన్నట్లు గుర్తించి డాక్టర్లు షాక్ తిన్నారు. సర్జరీ చేయాలని చెప్పడంతో తల్లిదండ్రులు అంగీకరించారు. ఎమర్జెన్సీ సర్జరీ చేసి కడుపులో ఉన్న వస్తువులన్నీ బయటకి తీశామని డాక్టర్లు చెప్పారు. పేగుల్ని సరిచేసి బాలుడికి ఇబ్బందులు లేకుండా చూశామన్నారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తాయని అన్నారు. ఆపరేషన్లో వైద్యులు సురేంద్ర, శ్రీకాంత్రెడ్డి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులు జాగ్రత్త..
పిల్లలు ఆడుకునే సమయంలో ఆట వస్తువులు నోట్లో పెట్టుకునే అవకాశం ఉంది. ఆ వస్తువులే బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. తల్లిదండ్రులు వారికి ఆట వస్తువులిచ్చేటప్పుడు జాగ్రత్తగా గమనించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.