
మొగుళ్లపల్లి, భూపాలపల్లి జిల్లా : భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూపాలపల్లిలో పామాయిల్ కంపెనీ పేరుతో ఎమ్మెల్యే గండ్ర పేదల భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అబద్దాల హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు చేసిందేమీ లేదనీ..ఆస్తులు పెంచుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేదన్నారు. పోడు భూములపై ప్రశ్నించిన గిరిజనులను చెట్టుకు కట్టేసి కొట్టిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లో రోడ్డుపై ఓ బాలుడిని కుక్కలు కరిచి చనిపోతే.. మంత్రి కేటీఆర్ సారీ చెప్పి చేతులు దులుపుకొన్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పేదోడి కడుపుకోత నీకు తెలుసా కేటీఆర్.. బీఆర్ఎస్ పాలనలో పేదోడి బిడ్డను కుక్కలు చంపితే సాయం చేసే మానవత్వం కూడా లేదా..? కనీసం మానవత్వం లేని మీరు మనుషులా రాక్షసులా..?’ అంటూ వ్యాఖ్యానించారు.
భూపాలపల్లిలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డికి కనిపించడం లేదా..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కార్యకర్తల ఉసురు తగిలి నాశనమై పోతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘రాజీవ్ గాంధీ విగ్రహం సాక్షిగా కేటీఆర్ కు సవాల్ విసురుతున్నాను. మీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆక్రమించుకున్న భూములపై విచారణకు సిద్ధమా..? మీ ఎమ్మెల్యే అక్రమ ఆస్తులపై విచారణకు సిద్ధమా..? సింగరేణి నిధుల దోపిడీపై విచారణకు సిద్ధమా..? మీ ఎమ్మెల్యే అవినీతిపై చర్చకు మేం రెడీ. బహిరంగ చర్చకు కేటీఆర్ సిద్ధమా..?’ అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక ప్రభుత్వం పోవాలి.. ఇందిరమ్మ రాజ్యం రావాలని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇళ్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.5లక్షల వరకు వైద్యం ఖర్చు కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల కష్టాలను తీరుస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యంతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. ‘ఈ ప్రాంతం (ఉమ్మడి వరంగల్ జిల్లా) ఆడపడుచుల చైతన్యానికి ప్రతీక. అలాంటి ఈ ప్రాంతంలో ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మనవడికి ఉద్యోగం రాలేదు గానీ.. మద్యం మాత్రం అలవాటైందని ఓ పెద్దవ్వ చెప్పింది. ఎవరిని కదిలించినా ఎక్కడ చూసినా దుఃఖమే కనిపిస్తుంది’ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.