
- ఇప్పటికే భారీగా ట్యాక్స్లతో అమెరికా నుంచి లాభపడ్డది: ట్రంప్
- మళ్లీ ఆ దేశంలో ఎలక్షన్స్ కోసం ఎందుకు నిధులివ్వాలని కామెంట్
వాషింగ్టన్: యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఎయిడ్) నిధులను అవకాశంగా తీసుకొని భారత్ భారీగా ప్రయోజనం పొందుతున్నదని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా వస్తువులపై ప్రపంచంలోనే అధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారత్ వద్ద చాలా డబ్బు ఉందని, ఆ దేశానికి తామెందుకు నిధులు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. వాషింగ్టన్నిర్వహించిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపీఏసీ)లో ట్రంప్ మాట్లాడారు. ‘‘భారత్ఎన్నికల్లో పోలింగ్శాతం పెంచేందుకు అమెరికా ప్రభుత్వం రూ. 182 కోట్లు (21 మిలియన్డాలర్లు) ఇచ్చింది. వారికి ఎందుకు మనం డబ్బులు ఇవ్వాలి. మన దేశంలో ఓట్ల సంఖ్య పెంచుకునేందుకు ఉపయోగించుకోవచ్చు కదా?.. వారి దగ్గరే చాలా డబ్బు ఉంది. అలాంటప్పుడు యూఎస్ ఎయిడ్ ఇవ్వాల్సిన అవసరమేంటి?” అని ప్రశ్నించారు. భారత ఎన్నికల్లో ఓటు వేసేవారి సంఖ్యను పెంచేందుకు అమెరికా ఇస్తున్న రూ. 182 కోట్లు నిధులను రద్దు చేస్తూ ఎలాన్ మస్క్ సారథ్యంలోని డోజ్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించారు.
చెత్తను తొలగిస్తున్నాం..
యూఎస్లో అక్రమ వలసదారుల బహిష్కరణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా దేశంలో ఉంటున్న విదేశీయులను వారి స్వదేశాలకు పంపడాన్ని సమర్థించుకున్నారు. తన ప్రభుత్వం మోసగాళ్లను ఇంటికి పంపిస్తూ దేశంలో పేరుకున్న చెత్తను తొలగిస్తున్నదని అన్నారు.