ప్రధాని మోడీకి డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక బహుమతి

ప్రధాని మోడీకి డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక బహుమతి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని న‌రేంద్ర మోదీకి ప్రత్యేక బ‌హుమ‌తి అంద‌జేశారు. ‘అవర్  జర్నీ టుగెదర్’ అనే పుస్తకాన్ని ప్రధానికి అధ్యక్షుడు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ బుక్‎పై 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్‌, యూ ఆర్ గ్రేట్' అని రాసి, ట్రంప్ సంత‌కం చేశారు. 320 పేజీల ఈ పుస్తకంలో 'హౌడీ మోదీ', 'నమస్తే ట్రంప్' కార్యక్రమాల తాలూకు ఫొటోల‌ను పొందుప‌రిచారు. 2019లో హూస్టన్‌లోని ఒక ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన 'హౌడీ మోదీ' ర్యాలీకి 50,000 మందికి పైగా భారతీయ అమెరికన్లు హాజరైన విష‌యం తెలిసిందే. ఈ ర్యాలీలో మోదీ, ట్రంప్ ఇద్దరూ ప్రసంగించారు.

ALSO READ | అక్రమ వలసదారులను వెనక్కి తీసుకొస్తా: ప్రధాని మోడీ

ఐదు నెలల తర్వాత ఫిబ్రవరి 2020లో అహ్మదాబాద్‎లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో 'నమస్తే ట్రంప్' కార్యక్రమం జరిగింది. ఈ రెండు భారీ ఈవెంట్లకు సంబంధించిన‌ ఫొటోల‌ను మోదీకి ట్రంప్ గిఫ్ట్ ఇచ్చిన బుక్‎లో హైలైట్ చేశారు. అలాగే ట్రంప్ మొద‌టి అధ్యక్ష పదవీ కాలం నాటి ఐకానిక్ క్షణాల తాలూకు ఫొటోల‌ను కూడా పొందుపర‌చ‌డం జ‌రిగింది. ఈ పుస్తకం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇండియా వెబ్‌సైట్‌లలో సుమారు రూ. 6,000 ధరతో అందుబాటులో ఉంది. అలాగే ట్రంప్ స్టోర్‎లో 100 డాల‌ర్లకు అందుబాటులో ఉంది.