
మెదక్, వెలుగు: మానవ జీవన వృక్షానికి బాల్యమే మూలాధారమని, స్టూడెంట్స్కు చిన్నతనం నుంచే నైతిక విలువలు, క్రమశిక్షణ, శ్రద్ధ వంటి లక్షణాలను నేర్పుతూ ఉత్తమ పిల్లలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని ప్రముఖ సైకాలజిస్ట్ సోనాల్ రవి అండ్రూస్ సూచించారు. ఆదివారం మెదక్ పట్టణం వెంకట్రావు నగర్ కాలనీలోని సిద్దార్థ్ విద్యా సంస్థల్లో నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ స్టూడెంట్స్కు స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించారు.
కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్గా హాజరై స్టూడెంట్స్కు పట్టాలు అందించారు. విశిష్ట అతిథి ఇట్రోడ్ సంస్థ నిర్వాహకులు మధుకర్ రెడ్డి మాట్లాడుతూ.. గురువులు స్టూడెంట్స్కు నేర్పే విద్య, దీపం లాంటిదని ఆ వెలుతురులో చిన్నారులు తమ భవిష్యత్కు దారిని తెలుసుకొని నడవాలని సూచించారు. బిల్డింగ్ బ్లాక్ బుక్ పబ్లిషర్స్ నిర్వాహకులు సాయి కృష్ణ అక్షరాల విలువను స్టూడెంట్స్కు వివరించారు. సిద్ధార్థ్ విద్యాసంస్థల సెక్రటరీ సంధ్యారాణి, చైర్మన్ శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ జీవితమనే, వినీలాకాశంలో స్టూడెంట్స్చక్కగా ఎగరడానికి అర్హత, యోగ్యత అనే రెండు రెక్కలు అవసరమన్నారు. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా సిద్ధార్థ్ విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం కలిసి సొచ్ స్వచ్ఛంద సంస్థకు రూ.7,77,777లను విరాళంగా అందజేశారు.