
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ఓవర్సీస్చీఫ్ శామ్ పిట్రోడా వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. చైనా విషయంలో భారత్ తన వైఖరి మార్చుకోవాలంటూ ఆయన కామెంట్ చేశారు. వీటిని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టగా.. ఆ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధంలేదని కాంగ్రెస్ వివరణ ఇచ్చుకుంది.
ఓ టీవీ ఇంటర్వ్యూలో శామ్ పిట్రోడా మాట్లాడుతూ.. ‘‘పొరుగు దేశమైన చైనాను శత్రువుగా చూడొద్దు. ఆ దేశంతో వచ్చే ముప్పు ఏమిటో అర్థంకావడం లేదు. మనం మొదటి నుంచీ ఘర్షణాత్మక వైఖరిని అవలంబిస్తున్నాం. ఇప్పటికైనా చైనా విషయంలో మన మైండ్ సెట్ మారాలి” అని అన్నారు. చైనాను అమెరికా శత్రువుగా భావిస్తున్నదని, అదే విధానాన్ని భారత్ కూడా ఫాలో అవుతున్నట్లుందని అన్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ సందర్భంగా.. చైనా విషయంలో భారత్కు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని భారత్ సున్నితంగా తిరస్కరించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత శామ్పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారతదేశ ఐడెంటిటీని, దౌత్యవిధానాన్ని, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఆయన కామెంట్లు ఉన్నాయని బీజేపీ మండిపడింది. ‘‘పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ మైండ్సెట్ను తెలియజేస్తున్నాయి. గతంలో రాహుల్గాంధీ కూడా చైనా విషయంలో ఇలాంటి కామెంట్లే చేశారు” అని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది తప్పుబట్టారు. కాగా, పిట్రోడా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ ప్రకటించింది.
‘‘శామ్ పిట్రోడా కామెంట్లు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు కావు. చైనా నుంచి ఇప్పటికీ మన దేశానికి విదేశాంగ వ్యవహారాలు, భద్రత, ఆర్థిక వ్యవహారాల్లో పెను సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి” అని కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్స్
ఇన్చార్జ్ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.