
- ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా నిరసన
- ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో పొట్టేలు కోసిన పీచర వాసులు
వేలేరు, వెలుగు: హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని పీచర గ్రామంలో కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే తాము ఇబ్బందులు పడతామని శుక్రవారం గ్రామస్తులు నిరసన తెలిపారు. శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా, ప్రాజెక్ట్ ప్రతిపాదిత స్థలంలో మైసమ్మ ఉందంటూ పొట్టేలును కోసి పూజలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈసందర్భంగా వేలేరు గ్రామస్తులు మాట్లాడుతూ పీచరలో ఏర్పాటు చేయబోయే బయో మెడికల్ వేస్టేజ్ప్రాజెక్టు వల్ల తాము అనారోగ్యాల బారిన పడతామని ఆందోళన వ్యక్తం చేశారు.
సర్వే నం.537/A1/2లో ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి తెలంగాణ పొల్యూషన్బోర్డు, స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ఇంపాక్ట్అసెస్మెంట్ అథారిటీ, పర్యావరణ, అటవీ, వాతావరణ తదితర శాఖల అధికారులు శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణకు రావాల్సి ఉండేదన్నారు. అందుకే వారు రాకుండా నిరసన తెలిపామన్నారు. తామంతా ఐక్యంగా ఉండి బయో మెడికల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు.