
నర్సింహులపేట, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల్లో కుల, మత చిచ్చులు పెడుతున్నాయని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో సోమవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తన్నదని, దీనివల్ల పేదలు, యువతకు నష్టం జరుగుతుందన్నారు. అయోధ్య పేరుతో మోడీ, తెలంగాణ సెంటిమెంట్ను అడ్డుపెట్టుకుని కేసీఆర్ ప్రజలను మోసం చేశారన్నారు.
జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యకర్త ఇంటికికీ వెళ్లి కాంగ్రెస్ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం మరిపెడ మండల కేంద్రంలో రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు జినుకల రమేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు దస్రునాయక్, పట్టణాధ్యక్షుడు కడుదుల రామకృష్ణ, మండల యూత్ అధ్యక్షులు పొన్నం శ్రీకాంత్ పాల్గొన్నారు.