
- రోడ్డెక్కిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్లబ్ధిదారులు
- సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి యత్నం
- మున్సిపల్ ఆఫీసు ముందు ధర్నా
గజ్వేల్, వెలుగు: ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించి ఆరు నెలలు గడుస్తున్నా అలాట్ చేయడం లేదంటూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ మున్సిపల్పరిధిలో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. గజ్వేల్ లో 1180 మందిని లక్కీ డ్రాలో ఎంపిక చేసినా ఇప్పటివరకు ప్రొసీడింగ్స్ఇవ్వలేదు. దీంతో వారంతా సోమవారం ఐవోసీ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. పోలీసులు పంపించివేయడంతో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు.
అక్కడ కూడా అడ్డుకోవడంతో గజ్వేల్ మున్సిపల్ ఆఫీసు ముందు ధర్నాకు దిగారు. లబ్ధిదారులు మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి రెండు సార్లు సీఎం కేసీఆర్ ను గెలిపించుకున్నా ఇండ్లకు నోచుకోలేదన్నారు. ఇండ్లు ఇస్తేనే ఓట్లు వేస్తామన్నారు. స్పష్టమైన హమీ ఇచ్చేంతవరకు వెళ్లేది లేదని 3 గంటలు బైఠాయించారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా వచ్చి హామీ ఇవ్వడంతో వెళ్లిపోయారు.
జగిత్యాలలో 52 మంది నకిలీ లబ్ధిదారుల గుర్తింపు
జగిత్యాల టౌన్ : డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపికలో 52 మంది నకిలీ లబ్ధిదారులను గుర్తించినట్లు జగిత్యాల డీఎస్పీ వెంకటస్వామి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జగిత్యాల బల్దియా పరిధిలోని మల్యాల మండలం నూకపల్లిలో 4,500 డబుల్ ఇండ్లు మంజూరు కాగా, మొదటి విడతలో 3,722 ఇండ్లను పంపిణీ చేశారన్నారు. ఇందులో అనర్హులకు ఇచ్చారంటూ ఫిర్యాదుల రావడంతో ఈనెల 6న హౌసింగ్డీఈ రాజేశ్వర్ తమకు కంప్లయింట్ చేశారన్నారు. దర్యాప్తులో భాగంగా హౌసింగ్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న భోగ రాకేశ్, మీసేవ ఆపరేటర్ చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. చంద్రశేఖర్ అనర్హుల పేర్లను సూచిస్తే ఆపరేటర్ రాకేశ్ ఫైనల్ లిస్టులో నాన్ఎలిజబుల్ ప్లేస్లో ఎలిజబుల్అనే టైప్ చేసేవాడన్నారు. ఒక్కొక్కరి నుంచిరూ.60వేల వరకు తీసుకున్నట్టు తేలిందన్నారు. నిందితుల నుంచి రూ.4లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ చెప్పారు. టౌన్ సీఐ నటేశ్, సిబ్బంది పాల్గొన్నారు.