చర్లపల్లి జైలులో ఆ ముగ్గురికీ డబుల్ బెడ్​రూమ్స్​ కట్టిస్తా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చర్లపల్లి జైలులో ఆ ముగ్గురికీ డబుల్ బెడ్​రూమ్స్​ కట్టిస్తా :  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్ వెలుగు :  చర్లపల్లి జైలులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి రోడ్​షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్​రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ బిడ్డ మద్యం కుంభకోణంలో జైలు కెళ్లినా ఏ మొహం పెట్టుకొని కేసీఆర్​బస్సు యాత్ర చేస్తున్నాడని ప్రశ్నించారు. ఆగస్టు15న సీఎం రేవత్​రెడ్డి రైతుల రుణమాఫీ తప్పకుండా చేస్తాడన్నారు. 

2018లో తాను ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత ప్రభుత్వం రాకపోయినా, అసెంబ్లీ లో నియోజకవర్గ  సమస్యలపై గళమెత్తానని గుర్తుచేశారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో రాజీనామా చేసి  కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలను మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరకు వచ్చేలా చేశానన్నారు. మునుగోడు ప్రజలకోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని, ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తానని అన్నారు. తమ ప్రభుత్వంలో ప్రభుత్వ బడుల్లో , ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్​రూం ఇండ్లు, శివన్న గూడ రిజర్వాయర్, ఉదయసముద్రం, మూసీ కాలువ, రాచకొండ భూముల సమస్య పరిష్కరించలేదని, అధికారాన్ని అడ్డంపెట్టుకొని కోట్లు దండుకున్నారన్నారు.