![సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డికి.. దేవులపల్లి రామానుజరావు పురస్కారం](https://static.v6velugu.com/uploads/2023/08/Dr-Devulapalli-Ramanuja-Rao_VYdr2nuM7J.jpg)
- తెలంగాణ సారస్వత పరిషత్ వెల్లడి
- ఈ నెల 25వ తేదీన అందజేత
హైదరాబాద్, వెలుగు: సీనియర్ జర్నలిస్ట్ ఆర్.దిలీప్ రెడ్డికి డాక్టర్ దేవులపల్లి రామానుజ రావు – 2023 పురస్కారం అందజేయాలని తెలంగాణ సారస్వత పరిషత్ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. మెదక్ జిల్లాకు చెందిన దిలీప్ రెడ్డిని ఈ ఏడాది పురస్కారానికి ఎంపిక చేశామని పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జే చెన్నయ్య పేర్కొన్నారు. దిలీప్ రెడ్డి.. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వివిధ హోదాల్లో పని చేశారని తెలిపారు. సమాచార హక్కు చట్టం కమిషనర్గా, పర్యావరణవేత్తగా విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 10:30 గంటలకు పరిషత్లోని డాక్టర్ దేవులపల్లి రామానుజ రావు కళా మందిరంలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రదానం చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కేవీ రమణాచారి చేతుల మీదుగా అవార్డుతో పాటు రూ.25 వేల నగదు, శాలువా, జ్ఞాపికతో సత్కరిస్తామని పేర్కొన్నారు. నాటి ఆంధ్ర సారస్వత పరిషత్కు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా, కవిగా, విమర్శకుడిగా, శోభ పత్రిక ఎడిటర్గా విశేష సేవలు అందించిన దేవులపల్లి రామానుజ రావు పేరుతో ఏటా ఈ పురస్కారాన్ని తెలంగాణ సారస్వత పరిషత్ అందజేస్తున్నది.