
హనుమకొండసిటీ, వెలుగు : అవినీతిని అంతం చేసేందుకు ప్రతి పౌరుడు సైనికుడిలా పోరాటం చేయాలని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ పిలుపునిచ్చారు. అవినీతిపై పోరాటం చేయడం ప్రతి ఒక్కరూ ప్రథమ కర్తవ్యంగా భావించాలని సూచించారు. ‘జ్వాల’ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండలోని లోక్సత్తా జిల్లా ఆఫీస్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలు మారుతున్నా అవినీతి మాత్రం ఆగడం లేదన్నారు.
అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వారిని సన్మానిస్తూ, ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న జ్వాల వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పలువురు ఆఫీసర్లను ఏసీబీకి పట్టించిన శివరాజ్, గోపాల్, విజయ్ని అభినందించారు. కార్యక్రమంలో లోక్సత్తా రాష్ట్ర సలహాదారు ప్రొఫెసర్ కోదండరామారావు, అంజలీదేవి, జ్వాల సంస్థ సభ్యులు అమర్నాథ్ ప్రకాశ్, సురేశ్ పాల్గొన్నారు.