
ఖైరతాబాద్, వెలుగు: జనాభా దామాషా ప్రకారం వైశ్యులకు రాజకీయ వాటా దక్కాల్సిందేనని వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘జనాభా దామాషా ప్రకారం వైశ్యుల రాజకీయ ప్రాతినిధ్యం’ అనే అంశంపై ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సత్యనారాయణ మాట్లాడుతూ వైశ్యులకు కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినా నిధులు ఇవ్వలేదని, కనీసం రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కూడా జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేయాలన్నారు. వైశ్యుల సమస్యలపై ఏప్రిల్ నెలలో వైశ్య రణభేరి పేరుతో 120 కిలోమీటర్లు పాదయాత్ర చేపడతామని స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొన్న పల్లె రవికుమార్, విమలక్క మాట్లాడుతూ వైశ్యుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. తులసి , రవి పాల్గొన్నారు.