జహీరాబాద్ ఏరియా హాస్పిటల్​కు 4 అవార్డులు

జహీరాబాద్ ఏరియా హాస్పిటల్​కు 4 అవార్డులు

జహీరాబాద్, వెలుగు :  కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నియమించిన మూడు కమిటీలతో పాటు, మరో ప్రైవేటు సంస్థ జహీరాబాద్ ఏరియా హాస్పిటల్​కు 4 అవార్డులు ప్రకటించినట్లు హాస్పిటల్​ సూపరింటెండెంట్​ డాక్టర్ శ్రీధర్, మాజీ సూపరింటెండెంట్​ డాక్టర్ శేషు రావు తెలిపారు. శనివారం సూపరింటెండెంట్​ఛాంబర్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో వారు వివరాలు వెల్లడించారు. 

జహీరాబాద్ ఏరియా హాస్పిటల్​వైద్యసేవలు అందించడంలో మంచి పేరు తెచ్చుకుందన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ నియమించిన ఎన్కాస్, ముస్కాన్, లక్ష్య ప్రోగ్రాంలలో ఈ అవార్డులు ప్రకటించారన్నారు. దీంతో ప్రతి సంవత్సరం హాస్పిటల్​కు రూ. 25 లక్షల చొప్పున 3 సంవత్సరాల పాటు ఆర్థిక సహాయం అందుతుందన్నారు. ఢిల్లీకి చెందిన బీఎఫ్ హెచ్ అనే  ప్రైవేట్ సంస్థ జాహీరాబాద్ ఏరియా హాస్పిటల్​ను సందర్శించి ఇక్కడ రోగులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా అవార్డులు అందజేశారన్నారు. 

ఇకముందు కూడా గవర్నమెంట్​ ఏరియా హాస్పిటల్​లో రోగులకు మెరుగైన సేవలందించి మంచి పేరు తెచ్చుకుంటామన్నారు. హాస్పిటల్​కు కేంద్ర బృందం  గుర్తింపు ఇవ్వడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ఆరోగ్యశాఖ కమిషనర్, జిల్లా వైద్యాధికారి, డీసీహెచ్​ఎస్​లకు కృతజ్ఞతలు తెలిపారు.