హైదరాబాద్‎లో డ్రగ్స్ కలకలం: పోలీసుల అదుపులో నైజీరియా వాసులు

హైదరాబాద్‎లో డ్రగ్స్ కలకలం: పోలీసుల అదుపులో నైజీరియా వాసులు

హైదరాబాద్: సిటీలో డ్రగ్స్ సరఫరాపై మరింత ఫోకస్ పెట్టామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. డ్రగ్స్ సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‎గా ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిపిన తనిఖీల్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు డ్రగ్స్ ముఠాలను అరెస్టు చేశామని అన్నారు. హెచ్ న్యూ, పోలీస్ ఆపరేషన్‎లో ఆఫ్రికాలోని నైజీరియాకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాయని అన్నారు. తనిఖీల్లో హుమాయిన్ నగర్‎లో 50 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 

అలాగే కంచన్ బాగ్లో 80 గ్రాముల ఎండీఎంఏ, 10 గ్రాముల ఎల్ఎస్డీ గుర్తించామని వెల్లడించారు. వీటి విలువ మొత్తం రూ.20.75 లక్షలు ఉంటుందని చెప్పారు. అయితే బెంగళూరు, గోవా నుంచి హైదరాబాద్‎కు సింథటిక్ డ్రగ్స్ సరఫరా జరుగుతోందని, ఒరిస్సా, ఛత్తీస్ గఢ్, ఏపీ నుంచి గంజాయి రవాణా అవుతోందని తెలిపారు. డ్రగ్స్ సరఫరాలో అబ్దుల్ రెహ్మాన్ అనే వ్యక్తి కీలకంగా ఉన్నాడని అన్నారు. 2014 నుంచి ఆఫ్రికా దేశాల నుంచి ఇక్కడకు స్టూడెంట్ వీసాతో వచ్చి గడువు ముగియడంతో హైదరాబాద్‎లో డ్రగ్స్ సప్లై చేస్తున్నారని వెల్లడించారు.

ALSO READ | పోలీస్ శాఖ కీలక నిర్ణయం: బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఊరట

కుర్భాకు బెంగళూరులో ఓ సప్లయిర్ ఉన్నాడని, వాట్సప్ గ్రూప్ ద్వారా ఆర్డర్స్, డ్రగ్స్ సప్లై నడిపిస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. పోలీసులకు తెలియకుండా జాగ్రత్త పడుతూ దందా నడిపారని, హాష్ ఆయిల్ సప్లై చేసిన ఇమ్రాన్ అనే వ్యక్తిని గత ఫిబ్రవరిలో అరెస్ట్ చేశామని, బెయిల్‎పై రిలీజ్ అయి మళ్లీ డ్రగ్స్ దందా చేస్తున్నాడని తెలిపారు. డ్రగ్స్ ఎవరు తీసుకున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.