
గాంధీనగర్: స్మగ్లర్లు సముద్రంలో డంప్ చేసిన రూ.1800 కోట్ల విలువైన 300 కిలోల డ్రగ్స్ ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), కోస్ట్ గార్డ్ పోలీసులు సీజ్ చేశారు. ఇంటర్నేషనల్ మారీటైమ్ బౌండరీ లైన్ (ఐఎంబీఎల్) వద్ద ఈ సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 12న అర్ధరాత్రి స్మగ్లర్లు గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రం ద్వారా డ్రగ్స్ తరలిస్తున్నారని సమాచారం రావడంతో ఏటీఎస్, కోస్ట్ గార్డ్ పోలీసులు ఉమ్మడిగా ఆపరేషన్ చేపట్టారు.
ఐఎంబీఎల్ వద్ద వారిని చూసిన వెంటనే స్మగ్లర్లు సరుకును సముద్రంలోకి విసిరేసి పారిపోయారు. పోలీసులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని ఏటీఎస్ సిబ్బందికి అందజేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. డ్రగ్స్ మెథాంఫేటమైన్ అయి ఉండవచ్చని పేర్కొన్నారు. అర్ధరాత్రి పూట ఆపరేషన్ జరగడంతో నిందితులను గుర్తించలేదని, అయితే ఒక అనుమానితుడిని గుర్తించామని చెప్పారు.