రాచకొండ కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న డ్రంకెన్​ డ్రైవ్​ కేసులు

 రాచకొండ కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న డ్రంకెన్​ డ్రైవ్​ కేసులు
  • ఫ్యామిలీ ముందు కౌన్సెలింగ్ ఇచ్చినా కనిపించని ఫలితం 
  • బుర్ర కథలు, స్పెషల్ ప్రోగ్రామ్స్​తో అవగాహన కల్పిస్తున్న పోలీసులు  

ఎల్​బీ నగర్, వెలుగు: మద్యం తాగి వెహికల్స్​నడపొద్దని పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొందరిలో మార్పు రావడం లేదు. పైగా గ్రేటర్ వ్యాప్తంగా రోజురోజుకూ డ్రంకెన్​డ్రైవ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఫైన్లతో పాటు కేసులు నమోదు చేసి జైలుకు పంపించినా వారిలో మార్పు కనిపించడం లేదు. మద్యం మత్తులో డ్రైవింగ్​ చేస్తూ దొరికిపోతున్నారు. ఇలా పట్టుబడిన వారిలో 21 నుండి 40 ఏండ్ల లోపు వారే ఎక్కువగా ఉంటున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించిన ప్రతిరోజూ ఒక్కో పీఎస్​పరిధిలో దాదాపు10 మందికి పైగా మందుబాబులు పట్టుబడుతున్నారు. వీరిలో మైనర్లు కూడా ఉంటున్నారు. పోలీసులు కౌన్సెలింగ్​ఇచ్చినా వారు మారట్లేదు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత నెలతో పోలిస్తే ఈ నెల డ్రంకెన్ డ్రైవ్ కేసులు మరింత పెరిగాయి. గత ఆరు నెలల నుంచి పెరుగుతూ వస్తున్నాయి.

ప్రమాదాల గురించి వీడియోల్లో చూపిస్తూ..

రాచకొండ కమిషనరేట్ పరిధిలో పట్టుబడిన వారిని ఎల్ బీ నగర్ లోని సీపీ క్యాంపు ఆఫీస్ వద్ద ఉన్న సెంటర్​లో కౌన్సెలింగ్​ నిర్వహిస్తున్నారు. గతంలో ఒక బ్యాచ్​లోనే  కౌన్సెలింగ్ పూర్తయ్యేది.  ప్రస్తుతం నాలుగు బ్యాచ్​లుగా డివైడ్ చేసి కౌన్సిలింగ్ ఇస్తున్నారంటే ఎంత మంది తాగి వెహికల్స్ నడిపి పట్టుబడుతున్నారో  తెలుస్తోంది.  మద్యం తాగి వెహికల్స్ నడపడం వల్లే ఎక్కువ రోడ్డు 
ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎన్నో ప్రమాదాల వీడియోలు చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. కుటుంబం ఆగమైతదని, మీరు చేసిన తప్పుకు ప్రమాదంలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని వివరిస్తున్నారు. ప్రమాదం జరిగితే మనపై ఆధారపడిన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటని, ఒక్కసారి ఆలోచించాలని చెప్తున్నారు. కుటుంబ సభ్యులను కూడా పిలిచి.. ఇంట్లో దీనిపై చర్చించుకోవాలని కోరుతున్నారు.

డ్రైవర్లకు రూల్స్ తెలియాలి

ఎక్కువ మరణాలు రోడ్డు ప్రమాదాల కారణంగానే జరుగుతున్నాయి. వీటిలో మద్యం మత్తులో డ్రైవ్ చేయడం వల్ల జరిగేవే ఎక్కువ. అందుకే వీటిని నివారించేందుకు రాచకొండ పోలీస్ కళాబృందం ద్వారా ప్రత్యేక పాటలతో అవగాహన కల్పిస్తున్నాం. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకరం డ్రైవర్లు పాటించాల్సిన అంశాలతో పాటు చలాన్ల గురించి వారికి వివరిస్తున్నం. - ఎ.నాగమల్లు, ఎల్ బీనగర్ ట్రాఫిక్ సీఐ, కళాబృందం ఇన్​చార్జి 

కుటుంబాల గురించి ఆలోచించాలి

తాగి వెహికల్ నడిపి పట్టుబడ్డ వారికి ఫైన్లు విధించి, జైలుకు పంపినా మార్పు రావట్లే. నివారణ కోసం అన్ని విధాలా కౌన్సెలింగ్ ఇచ్చి, మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం. మద్యం తాగి వెహికల్స్​నడిపేముందు ఒక్కసారి కుటుంబం గురించి ఆలోచించాలి. -  జోసెఫ్, రాచకొండ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఇన్​చార్జి